గద్వాల, నవంబర్ 24: భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోడు భూముల సర్వే, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, బృహత్పల్లె ప్రకృతి వనాలు, ధరణి టీఎం 33మ్యాడల్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సర్వే సుమారు పూర్తి కావచ్చిందని, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి పక్రియ పూర్తి చేయాలన్నారు. నవంబర్ 26నాటికి పోడు భూములకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే, గ్రామసభలు తదితర వాటిని కలెక్టర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ క్రీడా ప్రాంగణాల గురించి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనువైన స్థలాలు ఎంపిక చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 5బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సదరు ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలకు సబంధించి భూసేకరణ ప్రక్రియలో భాగంగా చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. అనంతరం సీఎస్ జీవో 58, 59, 76 భూ సబంధిత అంశాలపై చర్చించారు.
జీవో 58కి సంబంధించి వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిందని, కలెక్టర్లు తమ లాగిన్ నుంచి సదరు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 59కు సంబంధించి కలెక్టర్ ఆమోదించిన అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి క్రమబద్ధీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. ధరణిలో టీఎం 33కింద 1.03లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం 49వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
దరఖాస్తు చేసిన సమయంలో పొరపాట్లు వస్తే రివర్స్ చేసే సౌలభ్యాన్ని అధికారులకు అందించామన్నారు. ధరణిలో మొత్తం వచ్చిన 11లక్షల దరఖాస్తుల్లో 56వేలు పెండింగ్లో ఉన్నాయని వీటి పరిష్కారానికి కలెక్టర్లు చొరవ చూపాలని ఆదేశించారు. ఒకే గ్రామంలో ఎక్కువమంది రైతులు ఒకేలాంటి భూ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఎటువంటి భూ సమస్యలు పెండింగ్లో లేకుండా చూస్తామని చెప్పారు.
జిల్లాలో డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్రగృహా నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గురువారం హైదరబాద్ నుంచి సీఎస్ సోమేశ్కుమార్, హౌసింగ్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉన్నందున లాటరీ పద్ధతిలో పారద్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హుల జాబితా వెయిటింగ్ లిస్టులో ఉంచాలన్నారు. లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్ సరఫరా తదితర వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. ఇండ్లపై కలెక్టర్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పంపిణీ సజావుగా జరిగేటట్లు చూడాలన్నారు.
ఇండ్లను పంపిణీ చేసే సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోలన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. డబుల్ ఇండ్లు త్వరగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, పీఆర్ఈఈ సమత, అధికారులు రవీందర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.