అయిజ, మే 18 : నకిలీ ధ్రువీకరణ పత్రా లు సృష్టించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనర్హులకు చేరే విధంగా నకిలీగాళ్లు అడ్డదారులు తొక్కున్నారు. అర్హులకే సంక్షేమ పథకాలను సర్కారు అందిస్తుండగా, నకిలీ పత్రాలతో అనర్హులను అర్హులుగా మార్చుతూ అధికారుల సంతకాలు, స్టాంపులు వేసి కొందరు కిందిస్థాయి అధికారుల అండదండలతో దరఖాస్తులు చేసుకొని లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వం, అధికారులను మోసం చేస్తూ అసలైన అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అనర్హులకు అందించేందుకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. అయిజ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో సంకాపురం గ్రామానికి చెందిన గొల్ల నర్సింహులుయాదవ్ గత కొన్నేళ్లుగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రింటర్స్ నడుపుతున్నాడు.
ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణలో అధిక ఆదాయం సమకూరకపోవడంతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు, స్టాంపులు తయారు చేస్తూ అనర్హులకు అందజేస్తున్నట్లు కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేసి, నకిలీ వ్యవహారం గుట్టురట్టు చేశారు. అయిజ, గట్టు మండలాల్లోని గ్రామాల ప్రజాప్రతినిధుల అండదండలతో నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీలో సిద్ధహస్తులయ్యారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధిక మొత్తంలో అయిజ ప్రింటిం గ్ ప్రెస్లోనే సృష్టించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయిజ మండలంతోపాటు గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలంలోని అధిక గ్రామాల సామాన్య ప్రజలకు నకిలీగాళ్లు ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ప్రింటింగ్ ప్రెస్లోని కంప్యూటర్లో నిక్షిప్తమైన పత్రాలు చూస్తే విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 150కి పైగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.
కల్యాణలక్ష్మి పథకానికి అవసరమైన మ్యారేజ్ ధ్రువీకరణ పత్రంపై కార్యదర్శి సంతకం తప్పని సరి, అట్టి సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు స్టాంపులను తయారు చేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు, సివిల్ సర్జన్ డాక్టర్ల వంటి స్టాంపులను తయారు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఏపీ, కర్ణాటకలోని ప్రాంతాల సమాన్యులకు అందించినట్లు గుర్తించారు. టెన్త్ క్లాస్ మెమోలు, బోనఫైడ్, ఆధార్ కార్డు ల్లో అడ్రస్ల మార్పులు, జన్మదిన తేదీలు, ఫొటోలను మార్చడంలోనూ నకిలీగాళ్లు రాటుదేలారు. ఎక్కడ అనుమానం రాకుండా టెన్త్క్లాస్ మెమోలోనూ పేర్లు, పుట్టిన తేదీ, ఫొటో ను మార్పులు చేస్తున్నారు.
అయిజ పట్టణంలోని ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ధ్రువీకరణ పత్రాల ముద్రణ తయారు చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన కలెక్టర్ ప్రింటింగ్ ప్రెస్ను తనిఖీ చేసి నివేదికను అందజేయాలని తాసీల్దార్ను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో నకిలీగాళ్లు సృష్టిస్తున్న నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ బహిర్గమైంది. పెళ్లీడు లేకున్నా మ్యారేజ్ సర్టిఫికెట్లను తయారు చేసి కల్యాణలక్ష్మి పథకాలు కొళ్లగొట్టేలా పత్రాలు తయారు చేస్తున్నట్లు గు ర్తించడంతోపాటు ఏఏ విధమైన పత్రాలు త యారు చేసి సామాన్యులకు అందించారో గుర్తించి, నివేదికను కలెక్టర్కు పంపడంతోపాటు పోలీసులకు అందించారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్ష లబ్ధిపొందేందుకు కొందరు కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకొన్నట్లు తెలిసింది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆదిలోనే తిరస్కరించినట్లు సమాచారం. వివా హం జరిగి పదేళ్లు అయినా సర్కారు ఖజానాకు గండికొట్టేందుకు నకిలీ పత్రాలు సృష్టిం చి కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందినట్లు గుర్తించినట్లు తెలిసింది.
పట్టణంలో గత ఐదేండ్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన లబ్ధిదారుల్లో కలకలం మొదలైంది. దళారులు తమకు ఎక్కడ నకిలీ ధ్రువీకరణ పత్రాలు అంటగట్టారోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో అయిజ, గట్టు మండలా ల్లో విధులు నిర్వహించిన మండల స్థాయి అ ధికారుల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఐదు మందిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించడంతో నకిలీల సృష్టిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నకిలీగాళ్లలో కలవర పడుతున్నారు.
రిమాండ్లో ఉన్న ఐదు మం దిని కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తే మరికొంత మంది పేర్లు బయటకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు తమ పేర్లు బయటకు రాకుండా రిమాండ్లో ఉన్న వ్యక్తులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచా రం. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తప్పించుకొనేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. నకిలీ ధ్రువీకరణ పత్రాల సృష్టిపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.