జడ్చర్ల, నవంబర్ 9: పత్తికి మార్కెట్లో ధరలు అధికంగా పలుకతుండటంతో తెల్లబంగారం మెరిసిపోతుంది. బుధవారం జడ్చర్లలోని పత్తిమార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో క్వింటా రూ. 9,001ధర పలికింది. దీంతో రైతు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వానకాలంలో అధిక వర్షాలతో పత్తిపంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పండింది కాస్తా దక్కుతుందో లేదో అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడారు. కొద్దిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో పత్తిరైతులు తమతమ పొలాల్లో పండించిన పత్తిని తీస్తున్నారు. ఈ వానకాలంలో అధిక వర్షాలు కారణంగా పత్తిపంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దానికి తోడు తెగుళ్లు సోకడంతో చాలావరకు పత్తిపంటలకు నష్టం వాటిల్లింది. అయితే పత్తిధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతులకు కొంత ఆనందం కలుగుతుంది.
ఎందుకంటే వర్షాలకు పత్తిచేలు దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. దానికి తోడు ధరలు తగ్గితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ రైతులు పండించిన పత్తికి ఊహించని విధంగా అధికంగా ధర పలుకుతుంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే అత్యధికంగా ధరలు వస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.6,380 ఉండగా మార్కెట్లో క్వింటా రూ.9,000 పైగా ధర పలుకుతుంది. గతేడాది సీజన్ చివర్లో రూ.10వేలకుపైగా ధర పలికిన పత్తి ఈ సీజన్లో మొదట్లోనే అధిక ధరలు వస్తున్నాయి. ఈ సారి కురిసిన వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిపోవడంతో పత్తి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సీజన్లో బుధవారం అత్యధికంగా రాష్ట్రంలోనే బాదేపల్లి పత్తిమార్కెట్లో అత్యధిక ధరలు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లాలో గత ఏడాది 90వేల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేయగా ఈసారి దాదాపు లక్ష ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. అయితే గత ఏడాది కన్నా ఈసారి లక్షా25వేల ఎకరాల్లో పత్తిసాగు చేయించడానికి లక్ష్యం నిర్ణయించగా 25వేల ఎకరాలకు పైగా సాగు తగ్గింది. అధిక వర్షాల కారణంగా రైతులు వరిపైరు సాగుచేశారు.
రూ.9,001 పలికిన పత్తి
జడ్చర్లలోని బాదేపల్లి పత్తిమార్కెట్లో బుధవారం పత్తికి అత్యధికంగా క్వింటాకు రూ.9,001 ధర పలికింది. బుధవారం మార్కెట్కు పత్తి, ధాన్యం, మొక్కజొన్న, ఆముదాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్కు 225క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 9,001ధర రాగా కనిష్ఠంగా రూ.7,290 మధ్యస్తంగా రూ. 8,726ధర పలికింది. అదేవిధంగా 519 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,111ధర రాగా కనిష్ఠంగా రూ.1,409 మధ్యస్తంగా రూ.1,826ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 466 క్వింటాళ్ల హంసరకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,009 ధర రాగా కనిష్ఠంగా రూ.1,529 మధ్యస్తంగా రూ.1,636 ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 30 క్వింటాళ్ల సోనా ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.1,769 ధర వచ్చింది. అదేవిధంగా 3,946 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,197 ధర రాగా కనిష్ఠంగా రూ. 1,769 మధ్యస్తంగా రూ.2,088 ధర పలికింది.