నాగర్కర్నూల్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశంతో గ్రామాలు, పట్టణాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీంతో పింఛన్లు, రేషన్ కార్డులు, రూ.2,500 సాయం, రూ.500కి సిలిండర్, రైతు భరోసా, యువ వికాసంలాంటి పథకాలకు లబ్ధిపొందేందుకు ప్రజలు పెద్దఎత్తున సభలకు హాజరయ్యారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోనూ దరఖాస్తుదారులతో సందడి వాతావరణం నెలకొంది. కాగా, దరఖాస్తుల స్వీకరణలో సభలకు హాజరైన అధికారులకు ప్రజల నుంచి తలెత్తిన పలు సందేహాలకు సమాధానం కరువైంది. దీంతో ప్రభుత్వం స్పందించాల్సిందిగా ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ రూ.500కే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచి త ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భా గంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా మిగిలిన ఐదు గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశంతో గురువారం ప్రజాపాలన కార్యక్ర మం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గ్రామాలు, ము న్సిపాలిటీ వార్డుల్లో సభలను నిర్వహించారు. ఆయా గ్రా మాల సర్పంచులు, కౌన్సిలర్లతోపాటుగా ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఈ సభల్లో ప్రజల నుంచి గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరించారు. కాగా పెద్ద ఎత్తున సభలపై ప్రచా రం జరగడంతో గ్రామాలు, వార్డుల్లోని ప్రజాపాలనకు హాజరయ్యారు. అధికారులు ఊహించినదానికంటే అధికం గా ప్రజలు రావడంతో దరఖాస్తుల సమస్య తలెత్తింది. దీంతో చాలా మంది దరఖాస్తు జిరాక్స్లను తీసుకొచ్చి దరఖాస్తులు చేసుకొన్నారు. ఇది జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులకు పంట పండించింది. ఒక్కో జిరాక్స్ను రూ.10నుంచి రూ.40 వరకు విక్రయించడం గమనార్హం. కాగా గ్యారెంటీలకు దరఖాస్తులపై ప్రజలకు సందేహాలు నెలకొన్నాయి.
ఇప్పటికే వృద్ధాప్య, ఇతర పింఛన్ ఉంటే రూ.2,500 సా యం అందదని, రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలని, చనిపోయిన యజమానుల స్థానంలో కుటుంబీకులు దరఖాస్తులు చేసుకోవడం ఎలా, కిరాయి ఇండ్లల్లో ఉండే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తిస్తుందా, ఖాళీ స్థలం ఇస్తారా, రూ.5లక్షల సాయం అందిస్తారా.., అలాగే కూలీ పనులు చేసుకుంటూ గ్రామాలను విడిచి పట్టణాల్లో ఉంటున్న పే దలు ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలి, సొంత గ్రామాల్లో రేషన్ కార్డులు లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తిస్తుం దా, ఇప్పటికే రైతుబంధు అందుతుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా, జనవరి 6 వరకే దరఖాస్తు చేసుకోవాలా అనే పలు సందేహాలు నెలకొనగా స్థానికంగా ఉన్న అధికారులు సమాధానం ఇవ్వలేకపోయారు. కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామ స్థాయిలోనూ అవగాహన కల్పించడం జరిగేది. దీనివల్ల కొత్త పథకాల దరఖాస్తులో ప్రజలకు సందేహాలు కలిగేవి కావు. ఈసారి కేవ లం ఉమ్మడి జిల్లా స్థాయిలో అధికారుల సమీక్షనే జరిగింది. దీనివల్ల అధికారులు, సిబ్బందికే అవగాహన లేకపోవడంతో దరఖాస్తుల్లో సందేహాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలోని ప్రచారాలతోనే సభలకు హాజరుకావడంతో దరఖాస్తుదారులను గందరగోళానికి గురి చేసింది. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. కాగా ఉదయం నుంచే దరఖాస్తులకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. గత పదేండ్లలో వివిధ పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉండగా ప్రస్తుతం సభలు నిర్వహించడంతో గుంపులుగా తరలివచ్చిన ప్రజలతో అధికారులకు ఇబ్బంది కలిగింది. మొత్తం మీద తొలిరోజు సందడిగా ప్రారంభమైన ప్రజాపాలన పలు ప్రజల సందేహాలకు చోటిచ్చింది.
వనపర్తి, డిసెంబర్ 28 : ఆరు గ్యారెంటీల కోసం కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లో సరిపడా ద రఖాస్తులను అందుబాటులో ఉంచలేదు. దీంతో ఒక పక్క కార్యక్రమం నడుస్తున్నా.. ప్రజలు ఒక్కసారిగా దరఖాస్తు ఫారాల కోసం కౌంటర్లోని ఆర్పీలపై ఎగబడ్డారు. ప్రజలు సమన్వయం పాటించాలని, ప్రతి ఒక్కరికీ అందజేస్తామని, ఫారాలను జిరాక్స్ తీసుకొని దరఖాస్తు చేసుకున్నా సరిపోతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్ది చెప్పారు. కాగా, ప్రజాపాలన వేదికలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ ఫొటోలు కనబడకపోవడంతో ప్రజలు కొంత అసహనానికి గురయ్యారు. ఇది అధికార పార్టీ ప్రోగ్రామా లేక ప్రభుత్వ కార్యక్రమమా అని చర్చించుకున్నారు. మున్సిపల్, డీఆర్డీవో అధికారులు ఈ కార్యక్రమానికి బాధ్యులుగా వ్యవహరించారు. కానీ అధికారులను సంప్రదించగా ఎవరూ స్పందించలేదు.