అయిజ/కొల్లాపూర్ టౌన్, మార్చి 25 : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. పట్టణంతోపాటు పల్లెల వినియోగదారులు వేకువజాము నుంచే పడిగాపులు కాశారు.
కంపెనీలు సిలిండర్లను డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓటీపీ వచ్చిన కస్టమర్లకు సిలిండర్లు పంపిణీ చేయాలంటే కంపెనీలు సిలిండర్ల సరఫరాను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎన్నాళిలా సిలిండర్ల కోసం అష్టకష్టాలు పడాలని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. సరిపడా లేక హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లతోపాటు చాయ్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బందులు పడ్తున్నారు. వంట వండేందుకు పడరాని పాట్లు పడుతుండగా.. కొందరు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జీషాన్ రెస్టారెంట్ నిర్వాహకులు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిని నమ్ముకున్నారు. ఐదు రోజులుగా వంట చెరుకుతో వంట వండుతున్నారు.
– తాహేర్, ఫొటోగ్రాఫర్-నారాయణపేట