జడ్చర్ల టౌన్, జూన్ 5 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కావాలని ప్రజల తరఫున అడగకపోవడం.. సీఎంగా హామీలు ఇవ్వకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తే ఆ నియోజకవర్గ కేంద్రాలకు వరాల జల్లు కురిపించే వారని ప్రస్తుతం అందుకు భిన్నంగా ఇటు ఎమ్మెల్యే అడగకపోవడం అటు సీఎం గా వరాలు కురిపించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. జడ్చర్లను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు కొత్తగా మండలాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయా చోట్ల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రస్తావించినా సీఎం మాత్రం వాటిని ప్రస్తావించకుండా వెళ్లిపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సీఎంగా నియోజవర్గానికి వచ్చి కూడా ఏం లాభం అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.