‘పాలమూరు నా గుండెలో ఉంటది.. నాడు కరువు.. వలసలకు కేరాఫ్గా ఉండేది.. నేడు ఈ ప్రాంతంలో సాగునీరు పారించా.. కరువును తరిమా.. బీడు భూముల్లో కృష్ణమ్మను పారిచ్చా.. పసిడి పంటలు పండేలా చేశా.. పీఆర్ఎల్ఐ పూర్తయితే మరింత సస్యశ్యామలమై ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తుంది. ఇక కరువన్నది కన్నెత్తి కూడా చూడకుండా చూస్తాం.. సంక్షేమ పథకాలు.. సాగుజలాల రాకతో రైతుల మొఖాలు ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాయి.. ఇదంతా కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించాం.. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద మోటర్లు బిగిస్తున్నారు.. మూడు, నాలుగు నెలల్లో నీళ్లను కండ్ల చూస్తాం.. ఇక పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతది’.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు అన్నారు. ఉమ్మడి జిల్లాను అధోగతి పాలు చేశారని, ఇప్పుడేమో అడ్డంపొడవు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.. హస్తం పార్టీకి ఓటేస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధు కు చెక్ పెడతారని విమర్శించారు.
– మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, అక్టోబర్ 18
నాటి పాలమూరును చూసి చలించిపోయా.. ఒక్క గోస కాదు.. గంజి కేంద్రాలు పెడుతుంటే బాధ కలుగుతుండే.. ముంబయి బస్సులకు ఆలవాలం.. ఈ పరిస్థితులను చూసి ఉద్యమ సమయంలో నేనే ఓ పాట రాశా.. ‘కృష్ణమ్మ ఉంటే ఫలితం ఏమి లేకపాయే.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్ట పంటలు ఎండిపాయే’.. అని వినిపించా.. తర్వాత అందరి దీవెనలు.. కలిసి కొట్లాడినం.. చావు నోట్లో తల పెట్టినంకనే తెలంగాణ వచ్చింది.
..ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో
“నడువు.. నడువు రామక్క.. నడుముకట్టి రామక్క..
మన అన్న కేసీఆర్ జడ్చర్లకు వచ్చేనే రామక్క..
కారు గుర్తుకే ఓటేద్దాం రామక్క..
మన లక్ష్మారెడ్డి వచ్చిండే రామక్క’..
.. అంటూ కళాకారుడు ప్రకాశ్ పాడిన పాట సభలో మార్మోగింది.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టుదల ఉన్న నాయకుడు.. ఆయన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి.. సభలో జన సందోహం.. వారి ఆనందం చూస్తుంటేనే లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం అనిపిస్తుంది’.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగానే ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. సభా ప్రాంగణమంతా ఈలలు, కేరింతలతో మార్మోగింది.
మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, అక్టోబర్ 18 :ఒకప్పుడు పాలమూరు నుంచి చూస్తే కండ్లల్లో నీళ్లు వస్తుండే.. ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు, వలసలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి.. తెలంగాణ వచ్చినంక ఈ తొమ్మిదేండ్లలో పాలమూరు కరువును పూర్తిగా పోగొట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలో ప్రజాఆశీర్వాద సభలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణానది పక్కనే పారుతున్నా సాగు, తాగునీరు ఇవ్వాలనే ద్యాస ఆనాటి కాంగ్రెస్ నాయకులకు లేకుండేదన్నారు. ఉద్యమ సమయంలో నేను, జయశంకర్ సార్ పాలమూరులో తిరుగుతుంటే ఎక్కడ చూసినా కరువు తాండవించేదని, ఊళ్లకు ఊళ్లు వలసలు పోయేవి. బొంబాయి బస్సులు తిరుగులాడేవన్నారు. మహబూబ్నగర్ ప్రాంతం లో ఉన్న అడవులు కూడా బక్క చిక్కి ఉన్నామని, చెట్లు కూడా నీరులేక సన్నబడ్డాయని బాధపడిన సందార్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్లో గంజి, అంబలి కేంద్రాలు పడుతుంటే గుండెలవిసేలా బాధపడ్డాం, కొన్ని సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణానది పక్కనే పారుతున్నా ఉమ్మడి రాష్ర్టానికి చెందిన ముఖ్యమంత్రులు రావడం, పోవడం దత్తత తీసుకోవడం, నాటకాలాడడం, శిలాఫలకాలు వేయడంతోనే సరిపోయేదని ధ్వజమెత్తారు. ఉద్యమంలో నేనే పాట రాసిన ‘పక్కన కృష్ణమ్మ ఉంటే ఫలితం ఏమి లేకపాయే… పాలమూరు నల్లగొండ ఖమ్మం మె ట్ట పంటలు ఎండి పాయే..’అని పాడి వినిపించారు. మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్ నా గుండెల్లో ఉంటది.. ఇక్కడ పేదరికం ఎక్కువ ఉన్నది.. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చాక లక్ష్మారెడ్డి క్యాబినెట్ మంత్రిగా ఉండే అని చెప్పారు. అప్పుడే ఈ జిల్లాకు మెడికల్ కళాశాల, డయాగ్నొస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు వచ్చా యి.. ఇవన్నీ ఆయన పుణ్యమే అన్నారు. కృష్ణా జల్లాలో మన హక్కు రావాలని ఆనాడు కింద మీద పడ్డాం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు.. దద్దమ్మ ఎమ్మెల్యేలు నోళ్లు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోమన్నారు.. జూరాల అనేది బిత్తడి ప్రాజెక్టు కెపాసిటీ 9 టీఎంసీలే మనకు రెండు టీఎంసీల నీళ్లు కావాలి. మూడు రోజులు కొడితే జూరాల మొత్తం ఖాళీ అయితది, అన్ని ప్రాజెక్టులను జూరాల మీద తీసుకోవాలని ఈ సన్నాసులు చెప్పారని విమర్శించారు.
మనల్ని గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు.. శ్రీశైలం మీ అయ్యా జాగీరా దాంట్లో మన పైసలు లేవా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అక్కడ డిజైన్ చేపించామన్నారు. ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే కాంగ్రెస్ సన్నాసులు కేసులు వేసి అడ్డుకున్నారన్నారు. శ్రీశైలం నుంచి ప్రాజెక్టులు తీసుకోకుండా అడ్డుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. ఈ తొమ్మిదేండ్లపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నా ధర్మమే గెలుస్తుందని నమ్మినం అన్నారు. కేసులన్నీ పోయినాయి ప్రాజెక్టులకు అనుమతులు రావడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేసుకుంటున్నాం. శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డిని స్టార్ట్ చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు నిర్మించుకున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని, మరో మూడు నాలుగు నెలల్లో రిజర్వాయర్లలో నీళ్లు వస్తాయి.. పాలమూరు కరువు అనేది లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకుల భావ దారిద్రం వల్ల 60 ఏండ్లు గోసపడ్డాం.. కాంగ్రెస్ పార్టీ మనల్ని వలసలు పోయేటట్లు చేసింది. మోసపడ్డాం తెలంగాణ ఉరికే రాలేదు ఎంతోమంది ఆత్మబలి దానాలు, విద్యార్థుల చావులు నేను కూడా చావు నోట్లో తలకాయ పెట్టి వస్తే తప్పా తెలంగాణ ఇయ్యలే..అని గుర్తు చేశా రు.
పాలమూరు ప్రాజెక్ట్ కట్టుకున్నం.. ఇదే కాంగ్రెస్ దరిద్రులు అది కట్టొదు.. కడితే లక్ష్మారెడ్డికి పెరోస్తది, శ్రీనివాస్ గౌడ్కు, కేసీఆర్కు పేరొస్తదని అడ్డుకున్నారు. ఉద్దండాపూర్ పూర్తయితే జడ్చర్ల నెత్తిమీద కరివెన ఉంటది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా లక్షా యాబై వేల ఎకరాలకు నీరు పారి ఈ ప్రాంతమంతా సస్య శ్యామలం అవుతది, కరువు కన్నెత్తి కూడా చూడదని వివరించారు. గతాన్ని ఇప్పుడు పరిశీలిస్తే పాలమూరు పచ్చబడ్డది.. ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా అద్భుతమైన సీన్ కనపడుతుంది. గతంలో దుందు భీ నది దుమ్ము కొట్టుకుపోయి ఉండే… ఇప్పుడు చెక్ డాములు నిర్మించడంతోఎక్కడ చూసినా నీళ్లు ఆగుపిస్తున్నాయన్నారు. ఒక దుమ్ము కొట్టుకుపోయిన దుందుభీ ఇప్పుడు జీవనదిలా పారుతుంటే సంతోషమేస్తుందని అన్నారు. రేపు పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే ఈ జిల్లా రూపురేఖలే మారుతాయని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డితోపాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 18 : పోలేపల్లి సెజ్ పరిశ్రమలకు కేంద్రంగా మారింది.. జడ్చర్లను ఐటీహబ్గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. జడ్చర్ల అన్ని రకాల బ్రహ్మండంగా అభివృద్ధి దిశలో ఉందని.. రాబోవు రోజుల్లో మరింత అభివృద్ది జరుగుతుందని చెప్పారు. పాలమూరు జిల్లా నా గుండెలో ఉంటుందని.. పాలమూరు ఎత్తిపోతల పథ కం ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు మారుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చేది. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మహబూబ్నగర్ దరిద్రం పోవాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని ఆయన చెబితేనే మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముం దుండి పార్లమెంట్ ఎన్నిక తన భుజాన వేసుకొని నన్ను ఎంపీగా గెల్పించిండని చె ప్పారు. మొదటి నుంచి నా వెన్నంటి ఉన్న ఆయన నాతోపాటు మంత్రిగా చేసిండని గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి పట్టుదల గల నా యకుడు..ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో లక్ష్మారెడ్డిని మరొక్కసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద సభ కు వచ్చిన జనం చూస్తే లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని కేసీఆర్ నొక్కి చెప్పారు.