కల్వకుర్తి, నవంబర్ 18: ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్నాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్వకుర్తి- పాలమూరు ప్రధాన రహదారిలో కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 99లో డబుల్ బెడ్రూం ఇళ్ల సమూహం పక్కన ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం దాదాపు 8ఎకరాల స్థలాన్ని చదును చేశారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించేందుకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, 7 మండలాల నుంచి జనాన్ని సమీకరించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సభాస్థలంలో దాదాపు 20వేల కుర్చీలను ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
కల్వకుర్తిలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు వివరించానున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తికి సాగునీరు అందుతుండటంతో రైతుల జీవితాల్లో వచ్చిన గణనీయమైన మార్పులను ప్రజలకు వివరించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి పథకంతో కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. విద్య, వైద్యం, సాగునీరుతో పాటు, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ను పెద్ద మెజార్టీతో గెలిపించేందుకు కారుగుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరనున్నారు. సభ ఏర్పాట్లను శనివారం నుంచి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ పార్థసారథితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి హాజరుకానున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి బహిరంగ సభకు హాజరవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రత్యక్షంగా వీక్షించి వారి మాటలను నేరుగా వినేందుకు సభకు హాజరుకావాలని కోరారు. సభకు హాజరయ్యే ప్రజలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల వారీగా ప్రజలు సభకు హాజరయ్యేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని మున్సిపల్ చైర్మన్ సంతోషం వ్యకం చేశారు. సభ విజయవంతానికి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు.