ఊట్కూర్, నవంబర్ 4: అభివృద్ధి ప్రధాత.. సీఎం కేసీఆర్ మక్తల్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 4న మక్తల్ గడ్డపై సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం మక్తల్ నియోజకవర్గంలోని 5 మండలాలు, పేట, కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాలను కలిపి మొత్తం 13 మండలాలతో నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2లక్షల ఎకరాల సాగు నీటి సౌకర్యం కల్పించారు. సీఎం సహకారంతో పట్టణంలో 150 పడకల ప్రభుత్వ దవాఖాన, ఫైర్స్టేషన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయాలు, ఇంటర్మీడియట్, డీగ్రీ కళాశాల ఏర్పాటు చేయించారు. 99శాతం గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం, హైలెవల్ వంతెనల నిర్మాణం పనులను పూర్తి చేశారు. గత ఎన్నికల సందర్భంగా ఊట్కూర్ మండలానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. పనులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల హామీ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయో పరిమితి 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడంతో మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 9, 600 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరింది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల మరమ్మతుతో నిండు కుండను తలపిస్తున్నాయి. మత్స్య కార్మికులకు ఉచితంగా చేప పిల్లలు, పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగి మత్య్సకారులు ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలనన్నింటికీ నెరవేర్చారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు..
నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేశారు. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లాలోనే అత్యధికంగా 45వేల చిలుకు మెజార్టీ సాధించి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రజా సేవే లక్ష్యంగా ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుఫున నాలుగోసారి చిట్టెం పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
రేపు ప్రజా ఆశీర్వాద సభ..
ఎన్నికల పర్యటనలో భాగంగా మక్తల్లో సోమవారం) నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పట్టణంలోని ఎల్లమ్మకుంట (గుర్లపల్లి రోడ్డు) సమీపంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన స్థలంలోనే ఈ సారి ప్రజా ఆశీర్వాద సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష మందితో సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ, వాహన సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు.