రైతులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన వరితోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్న తరుణంలో రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అభయం కల్పించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రైతుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ తడిసిన ధాన్యం గురించి రైతులు భయపడొద్దని, చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించి ధైర్యం నింపారు. ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల కల్లాల్లో తడిసిన పంటను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు వరి కోతలు కోయొద్దని అధికారులు సూచించారు. కాగా అకాల వర్షాలతో నాగర్కర్నూల్ జిల్లాలో 428 ఎకరాల్లో వరి, 83 ఎకరాల్లో మొక్కజొన్న, 237 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.
నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ), మే 3: అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఇదేవిధంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోగా రూ.10వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. ఈక్రమంలో మరోసారి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతదశకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేపడుతూ ఊ రూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సింగిల్విండో, ఐకేపీ మార్కెట్యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాటిని ప్రారంభించారు. కాగా చాలా ప్రాంతాల్లో వరి కోత దశలో కురిసిన వర్షానికి రైతుల్లో ఆందోళన నెలకొన్నది. తడిసిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారని అయోమయం లో ఉండగా.. సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలిచారు. రైతులు భయపడొద్దని.. చివరి గింజ వరకూ ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మరో మూ డు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో వరి కోతలు ఆపాలని ప్రభుత్వం సూచిస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గాకే కోతలు చేపట్టాలని వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వచ్చే యాసంగిలో మార్చి నాటికి కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. దీనివల్ల అకాల వర్షాలతో పంట, ధాన్యం నష్టం జరుగకుండా నివారించేలా కార్యాచరణ చేపట్టనున్నది. ప్రభుత్వం ఇచ్చిన బరోసాతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది.
జిల్లాలో ఇలా..
నాగర్కర్నూల్ జిల్లాలో ఈ సీజన్లో 1,55, 608 ఎకరాల్లో వరి సాగు చేయగా 3.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిశ్చయించగా.. ఇప్పటివరకు 20 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని తేమ లేకుండా ఆరబెట్టుకొని కేం ద్రాలకు తీసుకు రావాలని మార్కెటింగ్ అధికారులు సూచిస్తున్నారు. వరి ఏ గ్రేడ్కు క్విం టాకు ధర రూ.2,060, సాధారణ గ్రేడ్ ధర క్వింటాకు రూ.2,040 చొప్పున ఖరారు చేశారు. ఇప్పటివరకు 20 కేంద్రాల్లో 1,060 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశా రు. కాగా వర్షాలతో జిల్లావ్యాప్తంగా 428ఎకరాల్లో పంటనష్టం జరిగింది. మొక్కజొన్న 83 ఎకరాలు, మామిడి 237 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.
ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
-మోహన్బాబు, జిల్లా సివిల్ సైప్లె అధికారి
సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వరి కోతదశలో ఉంది. వర్షాలు తగ్గే వరకు రైతు లు పంటను కోయవద్దు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొస్తే తప్పనిసరిగా మద్దతుధరతో కొనుగోలు చేస్తాం. రైతులు ఎవ రూ ఆందోళన చెందొద్దు.