HomeMahabubnagarCm Kcr As Apara Bhagiratha With Mission Bhagiratha Gangamma Was Abundantly Washed Away
సుజలం గొంతు తడిపిన కృష్ణమ్మ
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో తాగునీటికి కటకట, కలుషిత జలాలతో వ్యాధులబారిన పడుతూ ప్రజలు అనుభవించిన కష్టాలకు స్వరాష్ట్రం సిద్ధించాక తెర పడింది.
ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా తాగునీరు
ప్రజల దాహార్తి తీర్చిన మిషన్ భగీరథ
‘మిషన్’ శద్ధజలాలతో రోగాలకు చెక్
అపర భగీరథుడిలా మారిన సీఎం కేసీఆర్
ప్రజారోగ్యానికి సర్కారు పెద్దపీట
రూ.వేల కోట్లతో స్వచ్ఛమైన నీటి సరఫరా
‘పాలమూరు’ పూర్తయితే ఢోకా ఉండదిక..
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పరిస్థితి మారింది. ఎక్కడా పానీపట్టు యుద్ధాల్లేవు. దశాబ్దాలుగా తాగునీటి కోసం నలిగిన జనం తెలంగాణ ఏర్పడ్డాక స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుండడంతో ఆడబిడ్డలు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడై ‘మిషన్ భగీరథ’తో గంగమ్మను పుష్కలంగా పారించారు. గడపగడపకూ కృష్ణా జలాలు అందుతున్నాయి. దీంతో ప్రతి మారుమూల పల్లెలోనూ తాగునీటి కష్టాలు తీరాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు వచ్చా యి. ఏమాత్రం మురికిలేని, కలుషితం కాని కొబ్బరి నీళ్లవలే స్వచ్ఛమైన, శుద్ధమైన నీరు సరఫరా అవుతున్నది. రోగాలకు చెక్ పడింది. ఇదంతా మిషన్ భగీరథతోనే సాధ్యమైంది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం‘భగీరథ’ కోసం రూ.కోట్లు ఖర్చు చేసింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ఇక పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఏడాదంతా నీటికి ఢోకా ఉండదు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న మంచినీళ్ల పండుగను పురస్కరించుకొని కథనం..
– మహబూబ్నగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, జూన్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో తాగునీటికి కటకట, కలుషిత జలాలతో వ్యాధులబారిన పడుతూ ప్రజలు అనుభవించిన కష్టాలకు స్వరాష్ట్రం సిద్ధించాక తెర పడింది. రాష్ట్రం ఏర్పడక ముందు తాగునీరు కావాలంటే బిందెలు, బకెట్లు తీసుకొని కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చుకునే పరిస్థితి. బోర్లు వేసినా భూగర్భజలాలు అడుగంటి చుక్క నీరు కూడా రాని దుస్థితి. తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద మహిళల కుస్తీలు, పట్టణాల్లో అయితే ప్రజల కష్టాలు వర్ణనాతీతం. మున్సిపాలిటీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అప్పుడప్పుడూ సరఫరా చేసి చేతులు దులుపుకొనేవి. చేతిపంపులు, బోర్లు పనిచేయక వ్యవసాయ బావులే తాగునీటికి దిక్కయ్యేవి. మహబూబ్నగర్లో నెలకు రెండుసార్లు మాత్రమే సరఫరా చేయడంతో చాలామంది నీళ్లు అభించక ఇతర ప్రాంతాలకు మకాం మార్చే పరిస్థితి ఉండేది. నీళ్లు దొరకని పట్టణంలో ఉండొద్దని ఏకంగా వ్యాపారస్తులు సైతం తీర్మానించుకున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో టీ తాగితేనే గ్లాసుడు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఉండేది. తెలంగాణ వచ్చాక తాగునీటి కష్టాలను అధిగమించి వాగులు, రిజర్వాయర్లు, ఇతర నీటి లభ్యత ప్రాంతాలను గుర్తించి పట్టణాలకు మంచినీటి సరఫరా మొదలైంది.
పాలమూరు అంటే కరువు, ఆకలి చావులు, వలసలకు నిలయం, గుక్కెడు మంచినీళ్ల కోసం పడిన కష్టాలను కేసీఆర్ ఉద్యమ సమయంలో గమనించారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. కేవలం మహబూబ్నగర్ జిల్లాలోనే రూ.932కోట్లతో 877 గ్రామాలకు పైప్లైన్లు లింక్ చేసి అవసరం ఉన్న చోట సంపు హౌస్లను ఏర్పాటు చేసి శుద్ధజలాన్ని అందించారు. 1,58,134 ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ కంటెంట్ లేని శుద్ధ జలాన్ని అందించడంతోపాటు 734 పాఠశాలలు, 853 అంగన్వాడీ కేంద్రాలు, రైతువేదికలు, వైకుంఠధామాలు, గుళ్లూగోపురాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం భగీరథ నీటిని అందిస్తున్నారు. మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలకూ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ శుద్ధిచేసిన కృష్ణా జలాలను మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇంటింటికీ నల్లా పథకం కింద తాగునీటి కష్టాలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. పాలమూరు జిల్లాకేంద్రంతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి తీరడంతో ఇండ్ల అద్దెలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఆదివారం మంచినీటి పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా తాగునీటి పరిస్థితిపై ప్రత్యేక కథనం.
పాలమూరులో రోజూ తాగునీరు..
మహబూబ్నగర్లో నెలకు రెండుసార్లు తాగునీటి సరఫరా చేసిన పరిస్థితి నుంచి నేడు ప్రతి రోజూ తాగునీరు సరఫరా అవుతున్నది. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో పట్టణ ప్రజలకు నీటి కటకట తీరింది. గతంలో పాలమూరుకు తాగునీరిచ్చేందుకు పక్కనే ఉన్న కోయిలసాగర్ను కాదని రామన్పాడు నుంచి పైప్లైన్లు వేసి సరఫరా చేశారు. ఆ పైప్లైన్లను కొంతమంది ధ్వంసం చేసి నీళ్లు రాకుండా అడ్డుకుంటే చోద్యం చూశారు. తెలంగాణ వచ్చాక మంత్రి శ్రీనివాస్గౌడ్ పైప్లైన్ల లీకేజీలను నివారించి కోయిల్సాగర్, రామన్పాడు నుంచి సరఫరా చేపట్టి నెలకు నాలుగుసార్లు తాగునీరు అందేలా చూశారు. 2018లో మిషన్ భగీరథ పూర్తి చేయడంతో మహబూబ్నగర్ పట్టణంలో డిమాండ్కు సరిపడా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ 30 ఎంఎల్డీల తాగునీరు సరఫరా అవుతున్నది. జడ్చర్ల, మణ్యంకొండ వద్ద సంపుహౌస్లను ఏర్పాటు చేసి పట్టణానికి నిరంతరం మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
ఇంటింటికీ కృష్ణా జలాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదిలో తాగునీటి అవసరా ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృష్ణ రివర్ బోర్డుకు ఇండెంట్ పెట్టి కృష్ణాజలాలను మిషన్ భగీరథ పథకానికి మళ్లించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వాయర్లలో కొంతభాగం నీటిని తాగునీటి అవసరాలకు మళ్లించారు. ఏడాది పొడవునా ఉమ్మడి జిల్లాకు అవసరం మేరకు కృష్ణానది నుంచి నీటిని తోడుకునేందుకు ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనికి తగ్గట్లు కొల్లాపూర్ నియోజకవర్గంలో భారీ సంపులను నిర్మించి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వందలాది కిలోమీటర్లు పైపులైన్లు వేసి ఆయా చోట్ల కనెక్షన్ ఇచ్చి తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవిలో కూడా తాగునీటికి ఇ బ్బంది లేకుండా రిజర్వాయర్లలో నిల్వ ఉంచి ఇబ్బందులు లేకుండా మంచినీటిని అందిస్తున్నారు. కృష్ణా జలాలను అవసరాలకు వాడుకునే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు విస్మరించగా.. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథతో మారుమూల గ్రామాల్లోనూ తాగునీటి సరఫరా అవుతున్నది.
వనపర్తి జిల్లాకు ప్రత్యేకం..
వనపర్తి సమీపంలో పెద్దమందడి మండలం బుగ్గపల్లి.తండా వద్ద మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో జిల్లా అవసరాల కోసం ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన సంపుహౌస్ల వల్ల జిల్లాలోని 14 మండలాలకు ఏడాది పొడవునా తాగునీరు సరఫరా అవుతున్నది. కొల్లాపూర్ నుంచి వచ్చే కృష్ణా జలాలను వాడుకుంటూ జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్లలోని నీటిని కూడా వాడుకునేలా దీన్ని డిజైన్ చేశారు. వనపర్తి, కొత్తకోట, పెబ్బేర్, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఇక్కడి నుంచే జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే కరివెన రిజర్వాయర్ నుంచి లింక్ ఏర్పాటు చేసి పుష్కలంగా తాగునీరు అందించేందుకు మంత్రి భవిష్యత్తు ప్రణాళికను రచించారు. ఇప్పటికే సాగునీటి రంగంలో వనపర్తి జిల్లా రికార్డు సృష్టించగా భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు మంత్రి కృషి చేస్తున్నారు.
‘పాలమూరు’తో శాశ్వత పరిష్కారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా.. దాటి ముందుకు పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై ఆఖరుకల్లా ఏదుల, నార్లాపూర్ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపాలని ఇరిగేషన్ అధికారులకు టార్గెట్ విధించారు. తాజాగా ఏదుల రిజర్వాయర్ డ్రై రన్కు సిద్ధం కాగా.. ఇది సక్సెస్ అయితే జూన్ నెలాఖరు కల్లా పంపుహౌస్లో డ్రై రన్ చేపడుతారు. కృష్ణానదిలోకి జలాలు రాగానే ట్రయల్ రన్ సిద్ధం చేస్తారు. సెప్టెంబర్ ఆఖరు కల్లా ఏదుల, నార్లాపూర్, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే పాలమూరు ఉమ్మడి జిల్లాలో శాశ్వతంగా తాగునీటి కొరత తీరడంతోపాటు పుష్కలంగా మంచినీరు సరఫరా అవుతున్నది. పీఆర్ఎల్ఐపై విపక్షాలు ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్లి 7 టీఎంసీల తాగునీటి కోసం పనులు ప్రారంభించుకోవచ్చని అనుమతి తీసుకొచ్చింది. ఫలితంగా పాలమూరు-రంగారెడ్డి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల వేళ ప్రజలు మంచినీళ్ల పండుగను వాడవాడలా జరుపుకొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లా కేంద్రాలతోపాటు అన్ని చోట్ల మిషన్ భగీరథ పథకాల వద్ద సంబురాలు చేయనున్నారు.
ఎన్నో తంటాలు పడ్డాం
2014కు ముందు మర్లులో తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బారులుదీరే టోళ్లం.అయినా కూడా ఆ నీళ్లు సరిపోయేవి కావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ తాగునీటి కష్టాలు తీర్చిండు. తాగునీరు కొనే పరిస్థితి లేకుండా ఇంటి వద్దకే వచ్చేలా చేసిండు.
తాగునీటి కష్టాలు తీరాయి
సమైక్య రాష్ట్రంలో తాగునీటి కోసం 10 రోజులు ఎదురు చూసేటోళ్లం. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ తో ఆ కష్టాలు తీరాయి. వేసవిలో సై తం రోజు విడిచి రోజు తాగునీరు ఇంటి వ ద్దే కుళాయి ద్వారా పట్టుకుంటున్నాం. మం త్రి శ్రీనివాస్గౌడ్ కృషితో మహబూబ్నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది.