హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అకాడమీల పేరిట యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఒక కాలేజీ పేరిట అనుమతి తీసుకొని మరో కాలేజీ బోర్డు పెట్టి దర్జాగా క్లాసులు నడుపుతున్నాయి. కాలేజీల పేరిట అనుమతులు పొంది కోచింగ్ సెంటర్లను నడుపుతున్నాయి. ఇంటర్ కాలేజీల్లో హాస్టళ్లను నడపడంపైనా అనేక అభ్యంతరాలున్నాయి. తాజాగా ఇంటర్బోర్డు గుర్తింపు కోసం కొన్ని కాలేజీలు ఏకంగా హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనం సృష్టించింది. అయినా ఇంటర్బోర్డు చోద్యం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పత్తాలేని పర్యవేక్షణ..
ప్రైవేట్ కాలేజీల్లో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నా ఇంటర్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఇక అనుమతుల విషయంలోనూ సంబంధిత యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కవుతున్నారని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు కనిష్ఠంగా రూ. 50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఫేక్ ఫైర్ ఎన్వోసీలను డీఐఈవోలు, ఇతర అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక మామూళ్ల వ్యవహారం ఉండటం వల్లే ఈ అనుమతులు లభించాయని చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కాలేజీలు, సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని ఉల్లంఘనలిలా..
టాస్క్ఫోర్స్ చేత తనిఖీలు చేయిస్తాం
కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం. టాస్క్ఫోర్స్ కమిటీలేసి ప్రతి కాలేజీలోనూ తనిఖీలు నిర్వహిస్తాం. ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంపై పోలీసుల విచారణ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఆయా కాలేజీల ఆఫిలియేషన్ను నిలిపివేశాం. ఇంకా కొన్ని ఫైర్ ఎన్వోసీల పరిశీలన జరుగుతున్నది. అన్ని అంశాలపై హైడ్రా నుంచి పూర్తి నివేదిక అందగానే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఇప్పుడే చెప్పలేం.
– అభిలాష అభినవ్,ఇంటర్ బోర్డు కార్యదర్శి