మహబూబ్నగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు బీజేపీలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరాయి. పార్లమెంట్ టికెట్కు పోటాపోటీ నెలకొన్నది. ప్రధానంగా డీకే అరుణ, జితేందర్రెడ్డి ఎంపీ టికెట్పై కన్నేశారు. టికెట్ నాకంటే.. నాకంటూ ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ మరో రాష్ట్ర నేత శాంతకుమార్ పేరు సైతం తెరపైకి వచ్చింది. దీంతో ముగ్గురి మధ్య వివాదం ముదిరింది. టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానంతో మహబూబ్నగర్ నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉంటారని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుండగా.. మరొకరు అమిత్షా రంగంలో ఉండనున్నారని కౌంటర్ ఎటాక్లు మొదలు పెట్టారు.
ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అట్టర్ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ కూడా సదరు నేతలు ఆధిపత్యం కోసం వెంపర్లాడడం పార్టీ శ్రేణులకు చిర్రెత్తుక్కొచ్చిందంట. చివరకు పార్టీ రాష్ట్ర చీఫ్ ఎంట్రీ ఇచ్చే వరకు కూడా వెళ్లింది. దీంతో అధికారం కోసం పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీని ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ను ఢీకొనలేక బీజేపీ నానా తంటాలు పడుతున్నది. బీజేపీకి చెందిన డీకే అరుణ, జితేందర్రెడ్డి మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. పాలమూరు పార్లమెంట్పై కన్నేసిన ఈ ఇద్దరు టికెట్ దక్కుతుందో లేదో అనే అనుమానంతో మోదీ, అమిత్షా జపం చేస్తున్నారు. ఒకరు మోదీ పోటీకి దిగుతారని సోషల్మీడియాకు ఎక్కితే.. మరొకరు అమిత్షా పోటీ చేస్తున్నారని కౌంటర్ ఎటాక్లు చేస్తుండడంతో బీజేపీ కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసమే పార్టీలు మారుతున్న ఆ నేతలిద్దరు పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. తాజాగా మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ ఇద్దరి ఆధిపత్యం పార్టీ నేతలకు కంపరమెక్కించింది. చివరకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. పార్టీలో ఇమేజ్ కోసం పనిచేస్తే సహించేదిలేదని పరోక్షంగా హెచ్చరించారు. పార్టీ ఫండ్లు ఇస్తూ అందలం ఎక్కాలనే వీరి స్ట్రాటజీకి చెక్ పడింది. చివరకు బీజేపీ కార్యవర్గ సమావేశాలు కొండను తవ్వి ఎలుకను పట్టకున్నట్లుందని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను కలిసేందుకు వచ్చిన స్థానిక నేతలకు చుక్కెదురైంది. ఫంక్షన్హాల్ ఎదురుగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేయడానికి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులతో లాఠీచార్జీ చేయించి.. కేసులు పెట్టేవరకు వెళ్లడంతో దళితులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనతో అగ్రవర్ణాల పార్టీగా బీజేపీ రుజవైందని ఆరోపిస్తున్నారు.
ఎంపీ టికెట్ నాకే..
బీజేపీ నుంచి పాలమూరు ఎంపీ స్థానానికి మోదీ, అమిత్షాతో సహా మరో ఇద్దరు జిల్లా నేతలు పోటీ పడుతుంటే.. తాజాగా తనకే టికెట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ ప్రకటించడం హాట్టాపిక్గా మారింది. తనకు ఎంపీ టికెట్ ఇస్తారనే పార్టీలో చేరానని.. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు ఇది స్పష్టంగా తెలుసని చెప్పుకొంటున్నారు. అసెంబ్లీకి పోటీచేసే ఉద్దేశం లేదని.. మోదీకి కాకుంటే తనకే టికెట్ వస్తుందని తేల్చిచెప్పడంతో పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. ఆ ఇద్దరు నేతలకు చెక్ పెట్టేందుకే రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రి కలిసి ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పగటి కలలు కంటున్న నేతలు..
టీడీపీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తిరిగి తిరిగి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరింది. ఎంపీగా పోటీ చేసినా పరాజయం పాలైంది. అంతటితో ఊరుకోకుండా వచ్చే ఎన్నికల్లో సీఎం రేసులో ఉంటానని తేల్చిచెప్పడం పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో బండి సంజయ్ పాలమూరు వేదిక నుంచే పరోక్ష వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా బండిసంజయ్ కాబోయే సీఎం, ఆయనే మా పార్టీ అభ్యర్థి అని జితేందర్రెడ్డి తేల్చిచెప్పాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పొసగడం లేదని సమాచారం. ఎవరికివారే వ్యూహాలు రచిస్తున్నారట. కాగా, డీకే అరుణ చేపట్టిన సర్వేలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
గతంలో మంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసింది. అయితే, బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఊహించలేని అభివృద్ధి చేపడుతున్నారు. సాగు, తాగునీరు, అభివృద్ధి కండ్ల ఎదుట కనిపిస్తుంటే ఓర్వలేక.. తన మందిని పంపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయిస్తున్నది డీకే అరుణ. అయినా జనం నమ్మేస్థితిలో లేరని తేలిపోవడంతో షాక్కు గురైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని సొంత సర్వేలు కూడా తేల్చేశాయట. దీన్ని కప్పిపుచ్చేందుకే సీఎం రేసులో ఉన్నానని ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య గ్యాప్ ఉండడంతో రెండిటిలోనూ పోటీ చేయాలని ఉవ్విళ్లురుతుంటే.. మరో నేత చెక్పెడుతున్నారు. ఎంపీ టికెట్కు పోటీ ఎక్కువ కావడంతో అమిత్షా పేరు తెరమీదకు తీసుకొచ్చి చీప్ట్రిక్ ప్లే చేస్తుండడం గమనార్హం.
కార్యవర్గ సమావేశాలు.. అట్టర్ఫ్లాప్..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలంటూ చేసిన జిమ్మిక్కు అట్టర్ ఫ్లాప్ అయింది. ఏదో సాధిద్దామని పావులు కదిపిన నేతలు ప్రజలకు అవసరమైన ఏ ఒక్క తీర్మానాన్ని చేయలేకపోయారు. విమర్శలు, కొట్లాటలతోనే సరిపోయింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేస్తారని భావించినా.. ప్రస్తావనకు రాలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇలా అయితే బీఆర్ఎస్ను ఎలా ఢీకొడుతాం అని మదనపడుతున్నారట. గ్రామ, మండల స్థాయి నేతలంతా బీఆర్ఎస్లో చేరుతున్నా.. రాష్ట్ర స్థాయి నాయకులు పట్టించుకోవడంలేదు. సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతామని పగటి కలలు కంటున్నారని మండిపడుతున్నారు. కార్యవర్గ సమావేశాలు మొక్కుబడిగా నడిచాయని పార్టీ నేత ఒకరు బాహాటంగానే విమర్శించారు. జిల్లా అభివృద్ధిపై కేంద్రాన్ని ఒప్పించే ఒక్క తీర్మానాన్ని కూడా చేయకపోవడం పార్టీ బలహీనతకు అద్దం పడుతుందని పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ నేతలను కలిసేందుకు వివిధ నియోజకవర్గ నేతలు వస్తే కనీసం అపాయింట్ కూడా ఇవ్వలేదంటున్నారు. జిల్లా అధ్యక్షులను కూడా గౌరవించలేదట.