అమరచింత, జూన్ 26: అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలోని బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులును శుక్రవారం పరామర్శించారు.
ముందుగా ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధితుడిని తీసుకెళ్లి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్సై జయన్నతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి ఇంటి స్థలాలుగా మార్చి ఇతరులకు విక్రయించే క్రమంలో అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ సర్పంచ్ చిన్ననర్సింహులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయచూరు పరమేశ్ తమ కార్యకర్తలను ఊసగొలిపి కత్తులు, కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య అన్నారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులకు ఆత్మకూర్ సీఐ శివకుమార్ వత్తాసు పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వ స్థలం కబ్జా చేశారని ఘటనా స్థలానికి వెళ్తే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుందని, కబ్జాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి చేసిన వారిని ఇప్పుటి వరకు అరెస్టు చేయకపోవడంతో సీఐ మద్దతు ఉన్నట్ల్లు అర్థం అవుతుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చినా తాను ఊరుకోనని, ఎంతటివారినైనా వదిలిపెట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రవికుమార్యాదవ్, బంగారు శ్రీనివాసులు, వీరేశలింగం, రియాజ్, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.