మహబూబ్నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఈసీ ప్రకటనతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చేసిందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. షెడ్యుల్ వస్తుందని తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారం రోజులుగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అయితే ముందుగానే ఊహించినట్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించడంతో ఊహాగానాలకు తెరపడింది. షెడ్యుల్ విడుదల కావడంతో రాజకీయపార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగులకే టికెట్లు ఖరారు చేసి విపక్షాలకు సవాల్ విసిరింది. ఈనెల 18న సీఎం కేసీఆర్ జడ్చర్ల నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది.
వివిధ పనుల శ్రీకారం వాయిదా
ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం గద్వాల, అచ్చంపేటలో జరిగే మంత్రి కేటీఆర్ సభలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ రాకముందు నుంచే మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వారం రోజులుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇంకా టికెట్లు ఖరారు కాక ఆ పార్టీల క్యాడర్ తలలు పట్టుకుంటున్నది. నారాయణపేట జిల్లా కేంద్రంలో తమ నేతలకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లోనూ స్థానికేతరులకు టికెట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని కార్యకర్తలు మండిపడ్డారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు సహకరించాలని.. ప్రభుత్వ ఆస్తులపై వెలిసిన అనధికార ఫ్లెక్సీలు, ఇతరత్రా వాటిని తొలగించాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి రాజుకున్నది.
నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వెలువడడంతో ఉమ్మడి జిల్లా అంతటా రాజకీయ చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాతోపాటు టీవీల్లో ఈసీ మీడియా సమావేశాన్ని ఆసక్తిగా తిలకించారు. తెలంగాణతోపాటు ఐదు రాష్ర్టాల ఎన్నికలకు తేదీలు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల కానున్నది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలై.. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 30న పోలింగ్ నిర్వహిస్తారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈవీఎం మిషన్లు, ఇతరాత్రా వాటిని కలెక్టర్లు తనిఖీలు చేసి వాటిని జాగ్రత్తగా భద్రపర్చుతున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉండే నియోజకవర్గాలకు సమీకృత కలెక్టరేట్లలో, మిగితా చోట్ల నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల పత్రాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది వరకే ఓటర్ల తుది జాబితా ఖరారైంది.
18న జడ్చర్లకు కేసీఆర్ రాక
ఎన్నికల నగారా మోగగానే బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ 18న జడ్చర్లలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించే అవకాశం ఉన్నది. సీఎం పర్యటన ఖరారు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది.
బీఆర్ఎస్ హుషారు.. ప్రతిపక్షాల బేజారు
ఇప్పటికే గులాబీ పార్టీ మిగతా పార్టీల కంటే ముందే టికెట్లు ఖరారు చేసి సమరానికి సై అంటూ కదన రంగంలోకి దూకింది. ఇంకా టికెట్లు ఎవరికి ఇవ్వాలో తేల్చుకునేలోపే మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి నియోజకవర్గాలోల విస్తృత పర్యటనలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు బిజీబిజీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రూ.వందల కోట్ల పనులను చేపట్టారు. షెడ్యుల్ వచ్చే వరకు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని పేదలకు ఇబ్బందులు కలిగించొద్దని దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు కార్యక్రమాలతో క్యాంపు కార్యాలయాలు జనంతో నిండిపోయాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. 2018లో గులాబీ పార్టీని ఆదరించినట్లుగానే ఈసారి ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉంటారని పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించి సభను విజయవంతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మ్యానిఫెస్టోను చూసి విపక్షాల దిమ్మతిరగడం ఖాయమని అన్నారు.
రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్ల మీటింగ్
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు ఆయా జిల్లాల రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ప్రభుత్వ, రైల్వే ఆస్తుల వద్ద వెలిసిన ఫ్లెక్సీలు, ఇతరత్రా ప్రచార సాధనాలను తొలగించాలని ఆదేశించారు. వీటిని తొలగించడంతోపాటు నేతల విగ్రహాలకు మాస్కులు వేస్తామన్నారు. అధికారిక వెబ్సైట్లలో ఎలాంటి రాజకీయ పరమైన ఫొటోలు ఉండకుండా చూస్తామన్నారు. ఓటర్లు తమకు ఓటుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సివిజిల్ యాప్లో సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలైన తీర్చేందుకు 24 గంటలపాటు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్లను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ముగిసేదాక ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లు హెచ్చరించారు.