ప్రతి గుండెలో పంచాక్షరి జపం.. మదిమదిలో ఝుమ్మన్న ఓంకారనాదం.. ప్రతిధ్వనించిన ప్రణవ నాదం.. ప్రకృతి పరవశించేలా.. పరమ శివుడికి వినిపించేలా.. నమఃశివాయ నినాదాలు నింగినంటగా.. ఢమ.. ఢమ ఢమరుక శబ్ధాలు హోరెత్తాయి. హరహర మహాదేవ.. శంభో శంకర.. అన్న భక్తుల నామస్మరణతో శైవ క్షేత్రాలు పులకించాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా శివనామస్మరణతో మార్మోగింది. అలంపూర్ మొదలు..
బీచుపల్లి, కందూరు, పామాపురం, బుద్ధారం, ఉమామహేశ్వరం, భౌరాపూర్, శ్రీశైలం వరకు ఎక్కడ చూసినా శివయ్య నామమే.. శివపార్వతుల కల్యాణాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. ఆలయాలన్నీ కిటకిటలాడాయి. లక్షలాదిగా శివస్వాములు, భక్తులు తరలిరావడంతో శ్రీశైల క్షేత్రం జన సంద్రమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రభోత్సవంపై రుద్రనేత్రుడు భక్తజనులను కటాక్షించారు.