పాలమూరు, జూన్ 21 : సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కొత్త గంజి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధూపదీప నైవేద్యం కార్యక్రమానికి ఎంపికైన 37 మంది అర్చకులకు మంత్రి ఉత్తర్వులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంఢీ, సుదర్శన యాగం వంటివి చేశారని, అందువల్లనే రాష్ట్రంలో ఇప్పటివరకు కరువు కాటకాలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కేవలం రెండు నెలల్లోనే యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. వేములవాడ, మన్యంకొండ, కురుమూర్తి ఆలయాలన్నీ సకల సౌకర్యాలతో అద్భుతంగా మారాయన్నారు. ఒకప్పుడు పూజారులు, అర్చకులకు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ధూపదీప నైవేద్య కార్యక్రమం ద్వారా వారికి నెలకు రూ.10వేలు అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా కూడా అర్చకులకు అండగా నిలిచామని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్కమిటీ వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రమౌళి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, దేవాదాయశాఖ అధికారులు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.
రైల్వే బ్రిడ్జిని 12 నెలల్లో పూర్తి చేశాం
మహబూబ్నగర్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి వద్ద రూ.30కోట్లతో నిర్మించిన రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్, ప్రధానరోడ్డు, అప్పన్పపల్లి బ్రిడ్జి పనులను అడ్డుకునేందుకు కొంతమంది కోర్టులను ఆశ్రయించారని.. న్యాయం తమ వైపు ఉన్నందున అభివృద్ధి ఆగలేదన్నారు. అప్పన్నపల్లి ఫస్ట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు పన్నెండేండ్లు పట్టగా.. ఏడాదిలోనే ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోయారన్నారు. అప్పుడే రెండో ఆర్వోబీ కోసం పట్టుబట్టి.. 12నెలల్లోనే రెండో బ్రిడ్జిని పూర్తి చేశామన్నారు. ఆర్వోబీ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన వారికి అన్ని రకాలుగా నష్టపరిహారాన్ని చెల్లించి పనులు పూర్తి చేశామన్నారు. మహబూబ్నగర్లో రహదారులతోపాటు జంక్షన్లు, మినీట్యాంక్బండ్, శిల్పారామం నిర్మించామని, దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మహబూబ్నగర్లో 500 డ్రోన్ కెమెరాలతో లేజర్ ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. శిల్పారామం వద్ద వండర్లా ఏర్పాటు చేస్తామని, లండన్ తరహాలో 10 అంతస్తుల జాయింట్ వీల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం 200మంది క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ఒలింపిక్ రన్ను ప్రా రంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా కోర్డినేటర్ గోపాల్యాదవ్, డీవైఎస్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీఎస్పీ మహేశ్, డీఈవో రవీందర్, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు..
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో కావలి ఆంజనేయులు, బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఉస్మాన్, వ్యవసాయ బీజేపీ మండల అధ్యక్షుడు పాల ఆం జనేయులు, అదే గ్రామానికి చెందిన 50మంది వివిధ పార్టీల కార్యకర్తలు మంత్రి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. హన్వాడ మం డలం యురోనిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకు డు, మాజీ ఉపసర్పంచ్ అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు సుదర్శన్రెడ్డి, నర్సయ్యతోపాటు 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. న్యూ టౌన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఖాదర్ పాషా ఆధ్వర్యంలో పీవోపీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోసిన్, ఉపాధ్యక్షుడు సుభాన్, బురాన్, ప్రధానకార్యదర్శి నవాబ్ ఖాన్తోపాటు 200మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్ రూరల్ మండలం భవాని తండా, జానియానాయక్ తండాలకు చెందిన ఉపసర్పం చ్ అంజమ్మ, లాలూనాయక్తోపాటు 100మం ది గిరిజనులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరారు. వారికి మం త్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.