మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 15 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు గుండెల్లో గుబులు మొదలైందని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ బీఫాం అందుకున్న సందర్భంగా మహబూబ్నగర్లోని న్యూటౌన్ వద్ద గల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి చేసిన మంత్రిని ప్రజలంతా అండగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహులు పేర్కొన్నారు. సబ్బండ వర్ణాల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి చారిత్రాత్మకమైన విజయం సాధిస్తారని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్ కిశోర్, నర్సింహులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, నాయకులు రామకృష్ణ, పరమేశ్, బాలు ముదిరాజ్ పాల్గొన్నారు.