మహబూబ్నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చెప్పినందుకే ఆగిపోయాయని స్వయంగా అధికారులు చెబుతున్నారు. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకు చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు చర్చ జరుగుతున్నది. కావాలని పనులను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు సంధిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీన్ని తిప్పి కొడుతున్నారు. రెండు రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వివాదంతో పనులన్నీ ఆపడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మహబూబ్నగర్లో శాశ్వత వరద నివారణ చర్యల్లో భాగంగా విడుదలైన రూ.వందకోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులకు, తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) నిధులు మరో రూ.45 కోట్ల పనులన్నీ ఆగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలా సుమారు రూ.150 కోట్లకుపైగా పనులకు గ్రహణం పట్టడంతో బల్దియాలో ఎక్కడికక్కడే వర్క్స్ అంతా నిలిచిపోయాయి. ఈ పనులన్నీ నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే టెండర్ ముగిసి ప్రారంభించని పనులను మా త్రమే నిలిపివేశామని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అంటున్నారు. కాగా దీనికి విరుద్ధంగా పను లు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు అంతా గగ్గోలు పెడుతున్నారు. పనులు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అభివృద్ధి ఆగిపోయిందని ప్రచారం జోరందుకున్నది. దీనికి కారణం కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. మేమే మి ఆపలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ తహతహలాడుతున్నది. అవిశ్వాస తీర్మానంపై 27న ప్రత్యేక మున్సిపల్ సమావేశం జరగనుండడంతో రాజకీయ వేడి రాజుకున్నది.
మహబూబ్నగర్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ.వందల కోట్ల నిధులతో నాటి మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ గ్రేడ్లు కూడా పెంచి భవిష్యత్లో కార్పొరేషన్ దిశగా అడుగులు వేయించారు. దీంతో ఇక్కడ జరిగిన పనులతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి. ప్రగతి పనులు సాఫీగా జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో అంతా రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈలోపు కొందరు అధికార పార్టీ నాయకులు కమిషనర్ ఇతర ఇంజినీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి మా ప్రమేయం లేకుండా పనులు చేయొద్దని, వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్యేతో ఒత్తిడి చేయించినట్లు సమాచారం. దీంతో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎస్డీఎఫ్, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన పనులు ఆగిపోయాయి..
2022లో వచ్చిన వరదలతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణం విస్తరిస్తున్నా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద ఉప్పొంగి ఎక్కడికక్కడే పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.100 కోట్లు వరద నివారణ చర్యలకు మంజూరు చేయించారు. ఈ నిధులతో శాశ్వతంగా వరద నివారణ చర్యలు చేపట్టారు. కాల్వల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన రహదారుల ఏర్పాటుతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీనికితోడు మరో రూ.50 కోట్ల నిధులు జతచేసి అన్ని కాలనీలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు . టెండర్లు ఆహ్వానించి పనులు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల సమయం రావడంతో అన్ని పనులకు శంకుస్థాపనలు చేసి కోడ్ ముగిశాక పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు వర్క్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ప్రభుత్వమే మారిపోయింది. అధికార పార్టీ నాయకులు ఈ పనులన్నింటినీ తాము చెప్పే వరకు ప్రారంభించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
అధికార పార్టీ నాయకులు మహబూబ్నగర్ మున్సిపాలిటీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలు తాము చెప్పినప్పుడే ప్రారంభించాలని, మళ్లీ కొత్తగా శంకుస్థాపనలు చేసేందుకు ప్లాన్లు వేస్తున్నారని తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరై టెండర్లు పూర్తయ్యి పనులు ప్రారంభమయ్యాక సగంలోనే కొన్ని ఆపడం, ప్రారంభం కాని పనులను కూడా ఆపమని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా మున్సిపాలిటీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు కొందరు కౌన్సిలర్లను ఎరగా వాడుకొని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా దీన్ని విఫలం చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో గతేడాది చివర్లో చేపట్టిన పనులన్నింటినీ నిలిపివేసిన మాట నిజమే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పనులు నిలిపివేశాం. కాంట్రాక్టర్లు కూడా పనులు చేయకుండా వెళ్లిపోతున్నారు. కొన్ని పనులు ప్రారంభించినా మిగతా పనులు ఆగిపోయాయి.. ఎమ్మెల్యే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో టీఎఫ్యూఐడీసీ కింద సుమారు రూ.45 కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇందులో రూ.12 కోట్ల డ్రైనేజీలు, మిగతా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హెల్త్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో రూ.15 కోట్ల వరకు టెండరింగ్ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మరో రూ.24 కోట్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పనులు నిలిపివేశాం.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కేంద్రం రూపురేఖలే మార్చివేసి మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయిలో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న తరుణంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కేం ద్రంలోని పనులన్నీ ఆపడం దారుణం. ఎమ్మెల్యే కొంతమంది కౌ న్సిలర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్టర్లను బెదిరించి పనులన్నీ ఆపివేశారు.
పాలమూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చేస్తున్న ప్రచారం అబద్ధం. కాంగ్రెస్ వాళ్లు ఆపినారని చెప్పడం మరీ దారుణం. చాలా చోట్ల పనులు నడుస్తున్నాయి, కొంతమంది కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మా ఎమ్మెల్యే ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, అవి రాగానే చేపడుతాం. వార్డుల్లో పనులు చేస్తేనే కదా కౌన్సిలర్లకు పేరు వస్తది, కావాలని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు.