గద్వాల, ఫిబ్రవరి 8 : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్డీఎస్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తుంగభద్ర నీటిని అటు కర్ణాటక, ఇటు సీమాంధ్రపాలకులు అక్రమంగా తరలించుకుపోవడంతో ఏనాడూ ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గురించి ప్రశ్నించకపోవడంతో వారు అక్రమంగా లిఫ్ట్లు, మోటర్ల ద్వారా నీరు మళ్లించున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూ డా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నడిగడ్డ ప్రజలకు శాపంగా మారింది. ఇప్పటికే కర్ణాటక జలదోపిడీతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) బండబారిపోయింది. కేంద్ర జలవనరుల సంఘం రాష్ర్టానికి కేటాయించిన నీటిని కూడా కర్ణాటక ఇవ్వకుండా దోచుకుంటు న్నది. అయినా ప్రశ్నించే వారు లేరు.
ఆర్డీఎస్ పథకానికి 15.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. దీని కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా.. కర్ణాటక అక్రమనీటి చౌర్యం తో ఏనాడూ 30 వేల ఎకరాలకు మించి నీరు అందలేదు. ఇప్పటివరకు మన నీటి వాటాల్లో ఏనాడూ ఐదు నుంచి ఆరు టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేదు. ఉద్యమ నేత కేసీఆర్ నడిగడ్డలో పాదయాత్ర చేసిన సమయంలో ఆర్డీఎస్ రైతుల సమస్యలను గుర్తించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అం దిస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసి హామీని నిలబెట్టుకున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో తుమ్మిళ్ల లిఫ్ట్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రత్యేక రాష్ట్రంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా చివరి ఆ యకట్టు వరకు నీరు ఇవ్వాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. డీ-24 నుంచి డీ-40 వరకు ఉన్న చివరి ఆయకట్టుకు నీరందించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రతిపాదించారు. రూ.783 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. రూ.159 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేసి నవంబర్ 2018 నుంచి సాగునీటిని అందించారు. ఈ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే ఆర్డీఎస్ నీటి ద్వారా కేవలం 31,900 ఎకరాలకు మాత్ర మే ప్రస్తుతం నీరు పారుతున్నది. తుమ్మిళ్ల ద్వారా మి గిలిన 55,600 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అయితే ఈ ఎత్తిపోతలకు నీటిని తుమ్మిళ్ల గ్రా మ సమీపంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా తీసుకుంటున్నారు. ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బో ర్డు పరిధిలోకి వెళ్లడంతో నీటిని వాడుకొనే హక్కును కోల్పోతాం. వారు అనుమతి ఇస్తే తప్పా నీటిని ఈ లిఫ్ట్కు వాడుకోలేని పరిస్థితి. రైతుల చివరి ఆయకట్టుకు తెలంగాణ ప్రభుత్వం నీరు అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆ భూములను బీడు భూ ములుగా మార్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడిప్పుడే ఆర్డీఎస్ రైతుల భూములు పచ్చగా మారి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే రేవంత్ సర్కారు నిర్ణయం వల్ల తిరిగి బీడు భూములుగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని నడిగడ్డ రైతులు డిమాండ్ చేస్తున్నారు.