నారాయణపేట, జూన్ 19 : మహారాష్ట్రలోని ముంబయి, పుణె పట్టణాల్లో ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిం ది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల అసమర్థ పాలనతో ఉపాధి అవకాశాలు లేక ముంబయి, పుణె వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన తెలంగాణ ప్రాంత బిడ్డల ఆత్మీయ పలకరింపు కొండంత అండగా నిలిచింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గెలుపు కోసం నారాయణపేట ప్రాంతవాసులు పని చేయాలని, అక్కడ ఎన్నికల్లో పోటీచేసి మన ప్రాంతవాసులే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా రాణించాలని, పార్టీ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి భరోసా కల్పించారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నాయకుల గెలుపునకు తెలంగాణ బిడ్డలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సెటిలర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుండాలని చెప్పడంతో మరింత ధైర్యం వచ్చినట్లయింది. దీంతో ఎమ్మెల్యేపై గిరిజనుల్లో మరింత నమ్మకం పెరిగింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి మహారాష్ట్రలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని 40ఏండ్లు కావొస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి పలకరించిన పాపానపోలేదని సెటిలర్లు పేర్కొంటున్నారు. తెలంగాణలో తమకు ఓట్లు లేనప్పటికీ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మహారాష్ట్రకు రావడంపై సం తోషం వ్యక్తం చేస్తున్నారు. వేరే రాష్ట్రంలో సభ నిర్వహించి సక్సెస్ సాధించిన వ్యక్తుల్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లయింది.