అలంపూర్, డిసెంబర్ 9: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చల్లా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అలంపూర్ నియోజకవర్గంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపై అనూహ్య రీతిలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ నాయకుల్లో చర్చ మొదలైంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడుగా రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన చల్లా వెంకట్రామిరెడ్డికి పాతిక సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది.
అలంపూర్ నియోజకవర్గాన్ని శాసించే రీతిలో రాజకీయం నడిపిన మంచి పేరున్న నాయకుడు. అతను బలపర్చిన నేతలే ఇదివరకు(గత మూడు పర్యాయాలు, 15సంవత్సరాలు) విజయం సాధిస్తూ వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కార్యకర్తలకు నమ్మకమైన సేవలందిస్తూ అందరి హృదయాల్లో సుస్థురస్థానం సంపాదించాడు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా రాజకీయాలను ఓ మలుపు తిప్పిన నేతగా పేరున్నది. 20సంవత్సరాల కిందట సొంత గ్రామమైన పుల్లూరు సర్పంచ్గా ప్రజాసేవలోకి అడుగిడిన చల్లా మొదట స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి భారీ మోజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.
తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో కొన్ని రోజులు ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ నేటివరకు ఆయన బలపర్చిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. దీంతో ఆయనకు మచ్చలేని, అవినీతి రహిత నాయకుడిగా పేరున్నది. నేటికీ ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎవరిని బలపర్చినా ఆ అభ్యర్థులే విజయం సాధిస్తారనే నమ్మకం నియోజకవర్గంలో బలంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.