అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21,27,056 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. గద్వాలలో అత్యధికంగా 82.42 శాతం, మహబూబ్నగర్లో అత్యల్పంగా 77.72 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఫలితాలు వెల్లడికానుండగా.. ఉత్కంఠ నెలకొన్నది. కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ తమకే అనుకూలమని, మెజార్టీ స్థానాలు తమవేనన్న ధీమా అధికార పార్టీలో కనిపిస్తున్నది. పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటూ నిత్యం గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది. ఇప్పటికే ఓ కాంగ్రెస్ నేత ఓటమి భయంతో ముందుగానే ఏడ్చేసిన సంఘటన చోటు చేసుకున్నది.
మహబూబ్నగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు రాజకీయపక్షాలకు పరీక్షగా మారాయి. ఓటర్ల నాడి తెలియక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. నాగర్కర్నూల్ జిల్లాలోని ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోతానని భయంతో ఏడ్చేసినట్లు ప్రచారం అవుతున్నది. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారని బెట్టింగ్లు మొదలయ్యాయి. అభ్యర్థులంతా టెన్షన్లో ఉన్నారు. ఎవరు కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టబోతుందని విశ్లేషకులు అంటున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించే పనిలో పడ్డారు. ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతామని భయంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్తో విలాఖత్ కావడం సంచలనం కలిగిస్తుంది. కేంద్రంలో అధికారం కోసం అర్హులు చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేయి, చేయి కలపడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చాలాచోట్ల విపక్షాలు మైండ్ గేమ్ ప్లే చేసి ఓటర్లను తికమక చేసే ప్రయత్నం చేసినప్పటికీ గులాబీ గుబాలింపు తప్పదని అంటున్నారు. పోలింగ్ ప్రక్రియ తర్వాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలిపోయింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కనీసం 10 స్థానాలు దక్కించుకుంటుందని, మిగతా రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో కూడా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ కొడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కాగా, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో భారీ పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గద్వాల జిల్లాలో 82.42శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా, మహబూబ్నగర్ నియోజకవర్గంలో 77.72శాతం తక్కువగా పోలిం గ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో 28,89,871 మంది ఓటర్లకు గానూ 21,27, 056 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరిచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమైంది.
ఈనెల 3వ తేదీన కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల సాయంత్రం భారీగా క్యూలైన్లు ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఆయా నివేదిక వర్గాల పోలింగ్ ప్రక్రియ నిర్వహణలోని అధికారులు తలమునకలయ్యారు. ఈసారి ఎన్నికల కమిషన్ అనేక నిబంధనలు విధించడంతో వాటిని లెక్క చూసుకొని నిక్షిప్తం చేసే పనిలో పడ్డారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది తీసుకువచ్చిన ఈవీఎంలను ఆయా జిల్లా కేంద్రాల్లోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం కౌంటింగ్ చేయనుండడంతో ఆయా జిల్లా కేం ద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ర్యాలీలు ఇతర వాటికి అనుమతిని నిషేదించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200 మీటర్ల దూరంలోనే అందరినీ నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌటింగ్ కేంద్రం వద్ద అనుమతి ఉన్నవారికి లోపలికి పంపిస్తారు. ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ రాత్రి 10గంటల వరకు కొనసాగింది. ఒక్కో నియోజకవర్గంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మురాయించడం వల్ల సాయంత్రం ఐదు గంటల దాటిన తర్వాత ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం అమ్మపల్లిలో వనపర్తి మండలం చిట్యాల, నాగర్కర్నూల్ పట్టణంలోని 119 పోలింగ్ కేంద్రంలో అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల, వంగూరు మండలంలోని ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లి, జరగబోయినపల్లి, జడ్చర్ల మండలం కోడ్గల్, జడ్చర్ల పట్టణం మిడ్జిల్ మండలంలోని బోయినపల్లి, నవాబ్పేట మండలంలోని ఎన్మనగండ్లచ లోకిరేవు, రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ, ఈద్గానపల్లి, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపా డు మండలం చిన్నపొలికేపాడు, ఇటిక్యాల మం డలం షాబాద్, మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం, ఊట్కూరు మండలం పెద్దాపూ ర్, ఆత్మకూరు పట్టణం, గద్వాల నియోజకవర్గంలోని గద్వాల టౌన్, ధరూర్ మండలంలోని మద్దెలబీడు, గొర్లఖాన్దొడ్డి, కేటీదొడ్డి మండలంలోని గగన్పల్లి, మల్దకల్, ఎలుకూరు, దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం రాచాల, కందూరు, కొత్తకోట మండలం కనిమెట్ట, భూత్పూర్ మండ లం సిద్దాయపల్లి, మదనాపూర్ మండలం దుప్పల్లి, అజ్జకొల్లు, మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం పెద్దదర్పల్లి, రేపూరు, బుద్దారం, టంకర రూరల్ మండలంలోని జమిస్తాపూర్, అర్బన్ మండలంలోని ఎదిర,
కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంతోపాటు ఆమనగల్ మండలంలోని జంగారెడ్డిపల్లి, రామునింతల, కొల్లాపూర్ నియోజకవర్గంలో యన్మన్బెట్ల, సింగపట్నం, పెంట్లవెల్లి, నారాయణపేట పట్టణంలో పోలింగ్బూత్ నంబర్ 151,161లో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. 5గంటలలోపే క్యూలైన్లో నిల్చుండడంతో వారందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు. కాగా, చాలాచోట్ల ఒక్కో ఓటరుకు ఓటు వేసేందుకు రెండు నుంచి మూడు నిమిషాల టైం పట్టింది. దీంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఓటర్లు ఓటు వేసిన ఈవీఎం, వీవీ ప్యాట్లను సీజ్ చేసి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత ఇంజనీరింగ్ కళాశాలలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గ ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. అలాగే గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల కౌంటింగ్, వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి నియోజకవర్గం, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కౌంటింగ్ రంగారెడ్డి జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 28,89,871 మంది ఓటర్లలో 21,27, 056 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 1,78,069, దేవరకద్రలో 1,94,543, జడ్చర్లలో 1,79,600, గద్వాలలో 2,13,283, అలంపూర్లో 1,96,307, అచ్చంపేటలో 1,94, 077, కొల్లాపూర్లో 1,87,087, నా గర్కర్నూల్లో 1,83,098, నారాయణపేటలో 1, 81,780, మక్తల్ నియోజకవర్గంలో 1,86,860, వనపర్తిలో 2,10,739, కల్వకుర్తిలో 2,01 285 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. గద్వాలలో 82.42 శాతం అత్యధిక పోలింగ్ కాగా, మహబూబ్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 77 .72శాతం పోలింగ్ నమోదైంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు చాకచక్యంగా వ్యవహరించి ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలు వస్తే తప్పా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారనే విషయం తేలడంలేదు. దీంతో అభ్యర్థుల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 2018 ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ఉత్కంఠ నెలకొన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఓటింగ్ సరళి ప్రక్రియను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్దే పైచేయిగా కనిపిస్తున్నది. చివరి నిమిషంలో కాంగ్రెస్, బీజేపీ ఏకం కావడం రాజకీయ వర్గాలను విస్మయ పరిచింది. ఏదేమైనా ఓటరు మహాశయులు ఎవరికి పట్టం కడతారోనన్నది ఆదివారం తేలనున్నది.
వనపర్తి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దగ్గరికి వస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ పెరుగుతున్నది. ఇక ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను ముగించుకున్న తరుణంలో కౌంటింగ్ కార్యాచరణపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్ని చర్యలను తీసుకుంటున్నారు. వనపర్తి అసెంబ్లీ స్థానానికి 13మంది అభ్యర్థులు పోటీ చేయగా, 2,71 ,151 ఓటర్లుంటే, వీరిలో 2,10,739 మంది ఓటు వేశారు. పురుషులు లక్షా 6,606 ఓట్లు వేయగా, మహిళలు లక్షా 4,132 మంది, ఇతరులు ఒక్క ఓటు వేయడం జరిగింది. మొత్తం 77.72 శాతంగా పోలింగ్ నమోదైంది. వనపర్తి అసెంబ్లీ ఎన్నికల్లో 13మంది ఎమ్మెల్యే పదవికి పోటీలో నిలిచారు. వీరికి నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల వారీగా 1,71,947 మంది ఓట్లేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తూడి మేఘారెడ్డి, అనుజ్ఞారెడ్డి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు. వీరితోపాటు బీఎస్పీ నుంచి మండ్ల మైబూస్, ధర్మసమాజ్ పార్టీ నుంచి బంకల ఎల్లయ్య, ప్రజా ఏక్తా పార్టీ నుంచి సూర్యప్రకాశ్, ఏవోడీఆర్ పార్టీ నుంచి అర్జున్ పోటీ చేయగా, మరో ఆరుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులే ప్రచారాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా ఉన్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపించుకుంటాయన్న ధీమాలో బీఆర్ఎస్ ఉంది.
పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కేటాయించిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ప్రత్యేక పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూంలకు భద్రతను కల్పిస్తున్నారు. ఈవీఎం గదులకు సీల్ వేసిన అధికారులు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందునా అందుకు సంబంధించిన చర్యలపైనా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గద్వాల, డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికలు గురువారం ముగియడంతో గెలుపు, ఓటములపై ఉత్కంఠ నెలకొంది. ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు జోష్గా ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఐదేండ్ల కాలంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనకు అనుకూలంగా మారడంతో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని బండ్ల కృష్ణమోహన్రెడ్డి ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సరిత మాత్రం నేను బహుజన బిడ్డనంటూ, అవకాశం కల్పించాలని కోరుతూ ప్రచారం చేసింది. కాగా, నియోజకవర్గానికి సరిత చేసిందేమీ లేకపోవడంతో ఒకింత బీఆర్ఎస్కే ప్రజలు మొగ్గు చూపారని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో సీఎం కేసీఆర్ చేపట్టిన సభలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. అదే ఊపు బీఆర్ఎస్లో చివరి వరకు కొనసాగింది. అదే కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సభలు నిర్వహించిన ఫలితం అంతంత మాత్రమే కనిపిస్తుంది. బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్షా సభ ఏర్పాటు చేసినా ప్రజల నుంచి స్పందన రాలేదు. జిల్లాలో గెలుపు, ఓటములపై ఇరు పార్టీలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే కారు స్పీడ్ను హస్తం అందుకుంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 5,94,543 మంది ఓటర్లు ఉండగా, గద్వాలలో 82.42శాతం పోలింగ్ నమోదైంది. అలంపూర్ నియోజకవర్గంలో 79.8శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం గెలుపు ఓటముల ఉత్కంఠకు తెరపడనున్నది.