Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలంలో ఓ గ్రామ పరిధిలోని స్మశాన వాటికలో దొంగలు పడారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన స్మశాన వాటికలో ఉన్న విద్యుత్ మోటార్ గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తెలిసి చేశారా? తెలియక చేశారా అనేది ప్రశ్నగా మారింది. అదేవిధంగా గ్రామంలో చెత్త సేకరించేందుకు ఉపయోగించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ టైర్లు కొత్తవి మార్చి పాతవి వేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరితే స్మశాన వాటిక గేట్లు తెరిచి ఉండడం వల్ల ఎవరైన ఎత్తుకు వెళ్తారేమోనని, ముందు జాగ్రత్తగా గ్రామ వాటర్ మెన్, మరో ఇద్దరు సిబ్బంది విద్యుత్ మోటార్ను భద్రంగా తీసి పెట్టారంటూ, రేపోమాపో స్మశానవాటికలో ఫిట్ చేస్తారంటూ తేలిగ్గా సమాధానం ఇచ్చారు. మండలాధికారికి ఫిర్యాదు చేసిన తర్వాత గ్రామ కార్యదర్శి ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకు స్మశాన వాటికలో ఉన్న విద్యుత్మోటార్ ఏమైనట్లు? గ్రామ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో గ్రామాలలో పర్యవేక్షణలేక, గ్రామ పంచాయతీ వస్తువులు దొంగలు ఎత్తుకు వెళ్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.