కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచడంతోపాటు ప్రభుత్వోద్యోగులతో కలిపి ఏ నెలకు ఆనెల విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చినా.. తీరా గెలిచిన తర్వాత జీతాలు పెంచడం దేవుడెరుగు? ఉన్న జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ లితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ, ఆరేండ్లలోపు బాలలకు ఆటాపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే, ప్రభుత్వం నిర్వహించే పలు సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయినా నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వేతనాలు పెంచాలని అనేక ఆందోళనలు చేసినపుడల్లా కంటితుడుపుగా రూ.వందో రూ.200 లో పెంచేవారు. అవి ఏ మూలకూ సరిపోక ఇబ్బం ది పడేవారు. కానీ, కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వా త ఆ పరిస్థితి మారింది.
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించే కీలకమైన సేవ ల్లో ఉన్న అంగన్వాడీలకు సముచిత స్థానం కల్పించింది. కేంద్రంతో నిమిత్తం లేకుండా ఈ చిరుద్యోగుల సంక్షేమాన్ని చూసుకున్నది. తెలంగాణ వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ.3,200, హెల్పర్లకు ఇంకా తక్కువ వేతనం ఉండగా, రాష్ట్రం వచ్చిన వెంటనే వీరికి వేతనాలు పెంచింది. టీచర్లకు నెలకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800 వేతనం అందించింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా వేతనాలు పెంచలేదు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్నట్టుగా రెండు సార్లు పీఆర్సీ అమలు చేసింది. అయితే కరోనా విపత్కర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. సంక్షేమాన్ని మాత్రం ఆపలేదు. ఉద్యోగులకు అటో ఇటో వేతనాలు కాస్త ఆలసమయ్యాయి కానీ, ఏ నెల కూడా వేతనాలు ఆపలేదు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెం చుతామని, ప్రభుత్వోద్యోగులతో కలిపి ఏ నెలకు ఆ నెల విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇంకా ఒకటో తారీఖే వేస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75రోజులు గడిచింది. కానీ, ఇప్పటికీ వరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు విడుదల చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35వేల సెంటర్లలో పనిచేస్తున్న దాదాపు 65వేల అంగన్వాడీలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.
జీతాలు పెంచడమేమో గానీ, ఉన్న జీతాలు కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని మండిపడుతున్నారు. కాం గ్రెస్ పార్టీ ఏరు దాటినంక తెప్ప తగలేసిన చందం గా వ్యవహరిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని కన్నీటి పర్యంతమ వుతున్నారు. జీతాలు లేక తమ కుటుంబాల పరిస్థితి కడుదయనీయంగా మారతున్నదని, అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎదుట అయినా గోడు వెళ్లబోసుకుందామంటే, కనీసం వారిని కలిసే సమ యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు సత్వరమే జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.