వనపర్తి టౌన్, మే 11 : వనపర్తి జిల్లాలో 543 మందికి ‘డబుల్’ లక్కీ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ ఆర్డీవో కార్యాలయంలో అట్టహాసంగా లక్కీడిప్ను నిర్వహించారు. వనపర్తి మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో 3,540 దరఖాస్తులు రాగా.. 1,345 మందిని రీవెరిఫికేషన్ ద్వారా అధికారులు అర్హులుగా ప్రకటించారు. 14 కేంద్రాల్లోని లక్కీడిప్ ద్వారా 543 మందికి ఇండ్లను కేటాయించారు. దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 17, ఎస్టీలకు 6, మైనార్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు ప్రకటించారు. 8, 9, 25, 26, మారెమ్మకుంట వార్డుల్లో కలెక్టర్.., మిగిలిన కేం ద్రాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అధికారులు లక్కీడిప్ నిర్వహించారు.
అనంతరం ఆర్డీవో కార్యాలయంలో 543 మందికి పెద్దగుడెం, అప్పాయిపల్లి, చిట్యాల, పీర్లగుట్టలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించా రు. కాగా, ఎక్కువ మందిని అర్హులుగా ఎంపిక చేయడంతో.. తమకు ఇల్లు వస్తుందన్న ఆశ తో లక్కీడిప్నకు హాజరయ్యారు. తమకు లక్కీ తగలకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
సగర సంఘ భవనంలో 3, 4 వా ర్డుల కు నిర్వహించిన లక్కీడిప్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు కేటాయించాలని అధికారులు, పోలీసులతో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగారు. 5, 18, 19వ వార్డులు, గాంధీనగర్లో తమ పేర్లు లిస్ట్లో ప్రకటించి.. తర్వాత తొలగించారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ మాట్లాడుతూ అర్హుల లిస్ట్ను రెండు పర్యాయాలు పరిశీలించి జాబితా రూపొందించామని, లక్కీడిప్లో వచ్చిన వారికి ఇల్లు కేటాయించామన్నారు. మిగతా వారు తర్వాత ఇండ్ల కేటాయింపులో ముందు వరుసలో ఉంటారని, ఎవ్వరూనిరాశ చెందొద్దన్నారు. అనర్హులకు ఇండ్లు వచ్చినట్లు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.