కొత్తకోట, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. గురువారం మండల వ్యాప్తంగా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 51,352 ఓటర్లు ఉన్నారు. 25,556 మంది పురుషులు, 25,796 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టణంలో 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,708 ఓటర్లు ఉన్నారు. కాగా ఒక డీఎస్పీ, ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 135 పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు. అలాగే పోలింగ్ నిర్వహణ కోసం 480 మంది అధికారులు విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సౌకర్యం, మంచినీటితో పాటు వృద్ధులు ఓటు వేసేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144వ సెక్షన్ విధించినట్లు తెలిపారు.
దేవరకద్ర, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికలను పుర్కరించుకొని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న పోలీంగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నటరాజ్, సహాయ ఎన్నికల అధికారి బ్రహ్మంగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 289 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని పోలీంగ్ కేంద్రాల్లో ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, బాత్రూంలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ప్రత్యేక పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని పేర్కొన్నారు.
మదనాపురం, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మదనాపురం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో నాగేంద్రం బుధవారం తెలిపారు. దేవరదక్ర నియోజకవర్గానికి సంబంధించి మదనాపురంలో 4, దుప్పల్లి 4, అజ్జకొల్లు 4, కొన్నూరు 3, తిర్మలాయపల్లి 2, కొత్తపల్లి 1, ద్వారకానగరం 1, కొన్నూరు పెద్దతాండా 1, నర్సింగాపురం 1, నెలివిడి 1, రామన్పాడు 1, దంతనూరు 1, గోవిందహళ్లి 1, శంకరమ్మపేట 1 మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి గోపన్పేట 2, భౌసింగ్తండా 1, కరివెనలో 1 పోలింగ్ కేంద్రం మొత్తం 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓటరు నిర్భయంగా తన ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
భూత్పూర్, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకున్నట్లు తాసీల్దార్ పులిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 48పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఎన్నికల నిర్వహణకు 300మంది అధికారులు, సిబ్బంది విధులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరందరికీ అన్నిరకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. మండలంలోని 37,834మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలు ఉన్నట్లు తెలిపారు. మండల ప్రజలందరూ తమ ఓటును శాంతియుత వాతావరణలో వినియోగించుకోవాలని ఆయన కోరారు.