అయిజ, ఫిబ్రవరి 28 : అధికారంలో ఉన్నా లేకపోయినా అలంపూర్ నియోజకవర్గాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అయిజ ఎంపీపీగా ప్రహ్లాదరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో అలంపూర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి అలంపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధితోపాటు బీఆర్ఎస్ పటిష్టతే ధ్యేయమని అన్నారు. మండలంలోని 15మంది ఎంపీటీసీలు ఏకతాటిపై నిలబడి అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, అందకు అనుగుణంగానే ప్రజా ప్రతినిధులు, నాయకులు కృషి చేయాలన్నారు. అయిజ పట్టణంతోపాటు మండలాభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీటీసీలు కలిసికట్టుగా ఉండి మండల అభివృద్ధికి కృషి చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి ప్రజలు మిమ్మల్నే ఎన్నుకుంటారని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహకారంతో మండలాభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీపీ ప్రహ్లాదరెడ్డి తెలిపారు. ఎంపీపీగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రహ్లాదరెడ్డి, వైస్ ఎంపీపీ నాగేశ్వర్రెడ్డి, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.