అయిజ, ఆగస్టు 2 : తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక్షితంగా కాన్పులు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పీహెచ్సీ కాన్పులు నిర్వహణలో రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. 2022-23లో 1048 కాన్పులు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 1 వరకు 318 కాన్పులు పీహెచ్సీలో జరగగా.. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు (24 గంటల్లో) డాక్టర్ హేమ మానస పర్యవేక్షణలో 8 కాన్పులు సురక్షితంగా చేశారు.
అందులో ఐదుగురు మగ, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారు. కాగా అందరికీ సాధారణ ప్రసవం చేయడం గమనార్హం. 8 మంది బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో కేసీఆర్ కిట్లు అందజేసి 102 వాహనంలో ఇండ్లకు చేర్చారు. ఈ సందర్భంగా పీహెచ్సీ డాక్టర్ విష్ణు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది అంకితభావంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. 24 గంటల్లో 8 కాన్పులు సురక్షితంగా చేసిన డాక్టర్తోపాటు స్టాఫ్ నర్స్లు విజయకుమారి, శశికళలను ఆయన అభినందించారు.