గట్టు/కేటీదొడ్డి, మార్చి 5 : పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర్మించుకొని 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా.. రైతుబంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలను నాటి సర్కారు అందించడంతో వ్యవసాయం పండుగైంది. కానీ ఈ ఏడాది వర్షాలు అరకొరే పడడం.. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటడం.. గత డిసెంబర్లో అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చోటు చేసుకున్నాయి. డిసెంబర్ నుంచే సాగునీటికి గడ్డుకాలం మొదలవుతూ వ చ్చింది. యాసంగిలో సాగుకు నీటి సమస్య తీవ్రమవుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. పలు చెరువుల్లో నీరు లేకపోవడంతో వరి పంట సాగుకు కష్టంగా మారింది. బోర్లల్లో భూగర్భజలాలు తగ్గడంతో ఆగి ఆగి నీటిని పోస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో ఎత్తిపోతల ద్వారా కాల్వలు నిండుగా పారాల్సి ఉన్నా.. ఒట్టిబోయాయి. జూరాల, ఆర్డీఎస్ అధికారులు ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. గతంలో యాసంగి సీజన్లో పసిడి పంటలు పండించిన రైతులు ఆందోళనకు గురయ్యారు. బోర్ల కింద అరకొరగా వరి, ఇతర పంటలు సాగు చేసిన కర్షకులకు సైతం కరెంట్, నీటి కష్టాలు వెంటాడుతున్నా యి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు రాని పరిస్థితి.
దీంతో చేసేది లేక పలువురు భూమి పుత్రులు వేసిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది పచ్చదనంతో కళకళలాడిన పంటలు.. ఈ ఏడాది నీళ్లులేక వాడుబడ్డాయి. గట్టు మండలం పెంచికలపాడు శివారులో రైతు ఉడుముల చిన్న హనుమంతు రెండు బోర్ల ఆధారంగా మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆ పైరుకు రూ.వేల పెట్టుబడి పెట్టాడు. అయితే బోర్లు రోజురోజుకూ అడుగంటి పోవడంతో నీళ్లు చాలక రెండు ఎకరాల వరిపైరును ఎండగొట్టడానికి సిద్ధమయ్యాడు. మిగిలిన ఓ ఎకరా పైరు కూడా పండుతుందో లేదోననే బెంగతో ఉన్నాడు. ఈ క్రమంలో వరిపైరును గొర్లకు మేపడానికి ఇచ్చాడు. అలాగే గతేడాది యాసంగిలో కేటీదొడ్డి మండలంలో 13 వేల ఎకరాలు వరి సాగైంది. ఈసారి మాత్రం కేవ లం 6వేల ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేశారు. దిగుబడి గురించి ఆలోచిస్తే ఖర్చులకు కూడా చాలడం లేదని పెదవి విరుస్తున్నారు. ర్యాలంపాడు జలాశయం నుంచి సాగునీరు విడుదల కాకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో ఉన్న బోర్లలో భూగర్భజలాలు అడుగంటుకున్నాయి. వేసిన బోర్లు సైతం నీళ్లు పోయకపోవడంతో రైతుల్లో యాసంగి సాగు పంటలపై సందిగ్ధం నెలకొంది. ఈసారి యాసంగి పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది.
మూసాపేట, మార్చి 5 : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చెక్డ్యాంలను నిర్మించింది. సాగునీరు పుష్కలమైంది. మూసాపేట మండలం సంకలమద్ది-నిజాలా పూర్ గ్రామాల శివారులో పారుతున్న పెద్దవాగుపై రూ.5 కోట్లతో చెక్డ్యాంను 2020 సంవత్సరంలో నిర్మించారు. దీంతో నిజాలాపూర్తో పాటు, మూసాపేట, సంకలమద్ది, మహ్మద్ హూస్సేన్పల్లి శివారులలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బావులు సైతం నిండుగా దర్శనమిచ్చాయి. ఎక్కడ చూసినా సాగు జలాలు సవ్వడి చేయగా.. బంగారు పంటలు పండాయి. అలాంటి నేల నేడు బీళ్లుగా మారింది. మొన్నటి దాకా జలకళ సంతరించుకున్న చెక్డ్యాం ఒట్టిబోతున్నది. నీటి ప్రవాహం లేక పెద్దవాగు వెలవెలబోతున్నది. తాగు, సాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటితోపాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి. జంగంపల్లిలో అయితే సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ఫిబ్రవరి ఒకటో తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడం.. తర్వాత ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టినా సమస్యపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు.. దీంతో దాహార్తితో జనం తల్లడిల్లిపోతున్నారు. బిందెలు సైకిళ్ల్లు, బైక్లకు కట్టుకొని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. మహిళలు బిందెలతో రోడ్లపైకి వస్తున్నారు. నీటి కోసం పడుతున్న బాధలు ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.
రెండు బోర్లేస్తే సుక్క నీరు రాలే..
నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేసిన. నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నవి. రెండు బోర్లు వేస్తే సుక్కనీరు కూడా రాలే. పదేండ్లు బీఆర్ఎస్ సర్కారులో ఎన్నడూ ఇన్ని కష్టాలు పడలేదు. అప్పుడు అధి కారులు, నాయకులు రైతుల బాగోగులు చూ సేటోళ్లు. ప్రభుత్వం స్పందించి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలి.
పోయినేడాది ర్యాలంపా డు కాల్వ నీళ్లు వొచ్చి వరి పంట పండించినం. ఈసారి కాల్వలన్నీ ఒట్టిపోయినయి. నాలుగెకరాల్లో వరిపంట సాగుచేసిన. బోర్లల్లో నీళ్లు వొస్తలేవు. పంట ఎండిపోతున్నది. చేసేది లేక పంటను పశువులు, గొర్లు మేయడానికి వదులుతున్నాం. అప్పు చేసి పెట్టుబడిన పెట్టినం. తెచ్చిన అప్పులెట్లా కట్టాల్నో తెలుస్తలేదు.