మహబూబ్నగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా ఆశీర్వాద సభలతో గులాబీ దళం గర్జించింది. గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు దుమ్ము లేపాయి.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేత కేసీఆర్ కోసం మూడున్నర గంటలు ఓపికతో కూర్చున్నారు. అసలు ఎర్రటి ఎండలు ప్రజా ఆశీర్వాద సభలు అట్టర్ ఫ్లాప్ అవుతాయని భావించిన వారి చెంప చెల్లు మనిపించెలా జనం కుర్చీలకు అతుక్కు పోయారు. సభలో ఆటాపాటలకు ఊగిపోయారు. పాలమూరు మాస్ ఫేం లక్ష్మమ్మ పాడిన గులాబీల జెండాలో రామక్క పాటకు కేరింతలు కొడుతూ జెండాలను రెపరెపలాడించారు. కళాకారుల పాటకు జనం డ్యాన్స్లు చేశారు.. కేసీఆర్ హెలికాప్టర్ చెక్కర్లు కొడుతుంటే కింది నుంచి జనం అభివాదం చేశారు. ఎండలకు భయపడి ఆయా పార్టీలు సాయం త్రం.. లేదా రాత్రి పూట సభలు పెట్టుకుంటున్నారు. కానీ బీ ఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు ఎండల్లో పెట్టిన జనం స్పం దన చూస్తుంటే విపక్షాల దిమ్మతిరిగింది. అనుకున్న విపక్షాల అంచనాలు తలకిందులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఎండల్లోనూ ఇంత పెద్ద ఎత్తున సభలు జరగడం ఇదే తొలిసారి.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ఉందని జనాన్ని తరలించడం ప్రారంభించారు.. మధ్యాహ్నం 12 నుంచి ప్రజా ఆశీర్వాద సభకు జనం రాక మొదలైంది. అప్పటికే భగభగమంటూ భానుడు ప్రతాపం చూపాడు. అయినా జనం లెక్కచేయకుండా సభా ప్రాణంలోకి వందలాదిగా తరలిరావడం ప్రారంభించారు. భుజాలపై ఉన్న గులాబీ కండువాలను నెత్తి మీద వేసుకొని ఎండ నుంచి కాపాడుకుంటూ కేసీఆర్ కోసం ఎదురుచూడడం మొదలు పెట్టారు. దాదాపు మూడు గంటల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు కేసీఆర్ హెలికాప్టర్లో దిగారు. నేరుగా సభకు అభివాదం చేస్తూ వేదికమీద రాగానే ఈలలు, జెండాలు ఊపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు మూడున్నర గంటలు వేచి చూడటం.. జనం లేవకుండా అలాగే కూసోవడంతో పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీంతో కేసీఆర్పై జనం జోష్ చూసి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన.. ఇక కాపాడుకోవాల్సిన అవసరం మీ మీదే ఉందన్నారు. మీరంతా కేసీఆర్ వెంటేలే అని అనడంతో జనం స్పందన చూసి పొంగిపోయారు. కేసీఆర్ స్పీచ్ దాదాపు 30 నిమిషాలపాటు సాగినా జనం ఒక్క అంగుళం కూడా కదలకుండా ఆసక్తిగా ఆలకించారు. గువ్వల బాలరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. జనం ఎండను సైతం లెక్క చేయకుండా దాదాపు మూడు గంటలు సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉంటే గులాబీ బాస్ నాలుగు గంటలకు వచ్చారు. మధ్యాహ్నం వరకే పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ నిండిపోయింది. స్థలం లేక చాలా మంది బయట నిలబడ్డారు. చెట్ల నీడన.. రాజవారి బంగ్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. దీంతో గురువారం జరిగిన రెండు ప్రాంతాల్లోని ప్రజాఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. రెండు ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రగతి ప్రదాత కడిగి పారేశారు. ఎన్నికలు వచ్చాయి.. కాబట్టి జాగ్రత్త గా ఉండాలని కేసీఆర్ హితవు పలికారు. ఆయన మాటలకు మంత్రముగ్ధులై.. జనం జేజేలు పలికారు. ప్రజల నుంచి నీరాజనం లభించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొన్నది.