గద్వాల, జూలై 7 : జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస్తులు తీసుకెళ్లాలని చెప్పడంతో ఓటర్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఓటర్లు బీఎల్వోలకు ఫోన్ చేస్తే తప్పా ఇండ్ల దగ్గరకు వచ్చి దరఖాస్తు ఫారాలు తెచ్చి ఇవ్వని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.
మంగళవారం నాటికి వందశాతం ఫారాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించారు. అయితే జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం వరకే దరఖాస్తు ఫారాలు వందశాతం ఓటర్లకు పంపిణీ చేశామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారులు చెప్పడం ఒకటైతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోరకంగా ఉన్నాయి.
ఓటరు తమ ఓటును కాపాడుకోవాలంటే ఎన్యూమరేషన్ ఫారం అత్యం త కీలకం అయితే బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఇచ్చిన తర్వాత వారు ఫారాన్ని పూర్తి చేసి మళ్లీ బీఎల్వోలకు అందజేయాలి. అయితే జిల్లా కేంద్రంలో చాలా మందికి ఫారాలు అందలేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 5,03,859 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్వోలు దరఖాస్తుల పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు వాటిని ఎలా ఓటర్లు పూరించాలో చెప్పకుండా దరఖాస్తు ఫారాలు ఇచ్చి నిర్లక్ష్యంగా వెళ్లి పోతున్నారని ఓటర్లు వాపోతున్నారు. కొంతమంది ఓటర్లు దరఖాస్తు ఫారం ఎలా నింపాలో చెప్పాలని బీఎల్వోలను ఫోన్లో సంప్రదిస్తే స్పందించడం లేదని ఓటర్లు వాపోతున్నారు.
బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలు ఇచ్చిన తర్వాత వాటిని ఎలా నింపాలో తెలియజేయాలి. కానీ వారు ఫారాలు ఇచ్చి వెళ్లి పోవ డంతో దానిని ఎలా నింపాలో ఓటర్లకు తెలియక అయోమయానికి గురవుతున్నారు. తప్పుగా రాస్తే తమ ఓటు పోతుందో ఏమోనని ఫారం నింపడానికి జంకుతున్నారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటే ఎలా నింపాలి, లేకుంటే ఎలా నిం పాలో తెలియక ఓటర్లు పాట్లు పడుతున్నారు.
2002 ఓటర్ల జాబితా కోసం వెబ్సైట్లో వెతికిన వివరాలు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు ఫారాలు నింపడానికి చదువుకున్న వ్యక్తులు నానా అవస్థలు పడుతుంటే గ్రా మీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్ష్యరాసుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లు తమ ఉంటుందో పోతుందో అనే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 40ఏళ్ల లోపు వయస్సు వారికి 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి వారికి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం రెండో కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
తండ్రి పేరు, తండ్రి ఓటరు కార్డు నెంబర్, బంధువు పేరు అన్న చోట తాత, అలాగే వారి తండ్రి ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం బూత్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే చాలా మంది ఓటర్లు తమ తండ్రి, లేదా తల్లి ఓటు వివరాలు తెలుసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఫారాల్లో వివరాల నమోదు విషయంలో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
బీఎల్వోలు నేరుగా ఫారాలను ఓటర్ల చేతికి ఇచ్చి మీరే పూర్తి చేసుకోండి అని చెప్పి వెళ్లి పోతుండడంతో ఆ ఫారాలు ఎలా నింపాలో, ఏ వివరాలు ఎక్కడ రాయాలో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ప్రభుత్వం సరైనా గైడ్ లెన్స్ లేకపోవడంతో ఫారాల భర్తీ ప్రక్రియ పూర్తిగా జిల్లాలో గందరగోళంగా మారింది. ఫారాల భర్తీపై బీఎల్వోలు, సూపర్వైజర్లకు మరో విడుత శిక్షణ ఇవ్వాలని ఓటర్లు కోరుతున్నారు. దీనికి తోడు దరఖాస్తు ఫారాలు ఎలా నింపాలో ఓటర్లకు బీఎల్వోలు సూచించే విధంగా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.