మహబూబ్నగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐటీ రంగంలో తెలంగాణకు ఎవరూ సాటిరారని, దేశంలో 50శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.62 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అలాగే రూ.38.5కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయం ప్రారంభంతో పాటు ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో 25ఎకరాల విస్తీర్ణంలో రూ.166 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో ఉద్యోగులనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. దేశంలో ఐటీ రంగంలో రెండు ఉద్యోగాలు వస్తే అందులో ఒకటి కచ్చితంగా తెలంగాణలోనే దొరుకుతున్నదన్నారు. తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం కూడా ఎంతో పెరిగిందన్నారు.
రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు, వాగులు, వంకలు కనిపించేవని గుర్తుచేశారు. గోరటి వెంకన్న రాసిన ‘వాగు ఎండిపాయె.. పెద్ద వాగు ఎండిపాయె’.. అంటూ గతంలోని కరువు, గోసలు మీద, దుందుభీ నది ఎలా దుమ్ము కొట్టుకుపోయిందో పాట రూపంలో చక్కగా చెప్పారని గుర్తుచేశారు. కానీ నేడు హెలిక్టాపర్లో హైదరాబాద్ నుంచి వస్తుంటే చెక్డ్యాంలు, పచ్చని పంటలతో దర్శనమిచ్చిందన్నారు. నాతోపాటు, కార్యదర్శి స్మితాసబర్వాల్ దుందుభీ వాగుపై కట్టిన చెక్ డ్యాంలు, వాటిలో వచ్చిన నీళ్లను చూసి చాలా సంతోషపడ్డామన్నారు. గతంలో కల్వకుర్తి ప్రాంతం ఎండిపోయిన చెట్లతో ఎడారిని తలపించేదని, అటువంటి కల్వకుర్తి నేడు పంటలతో సస్యశ్యామలంగా కనిపిస్తున్నదన్నారు.
చక్కటి సమీకృత పరిపాలన, ఎస్పీ భవనాలను నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు, నాగర్కర్నూల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్ భవనాలను నెలలోపు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబడడం సంతోషంగా ఉన్నదన్నారు. మంచినీటి పథకం కావచ్చు.. కరెంట్ కావచ్చు.. అనేక రంగాల్లో విజయం సాధించి అనేక అవార్డులు, రివార్డులు సా ధించామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో అద్భుత ప్రగతిని సా ధించాం.. ఇదే స్ఫూర్తితో చిరునవ్వులు చిందించే తెలంగాణ కోసం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వలసలు, కరువు, ముంబాయి బస్సులకు ఆలవాలమైన ఉమ్మడి పాలమూ రు జిల్లాలో నేడు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారు.
‘పాలమూరు’ కు సాగునీళ్లిస్తాం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 100శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీదుగా వెళ్లే సమయంలో అడవులు కూడా పలుచబడిపోయిన సంఘటనలు ఉండేవని గుర్తుచేశారు. అలాంటిది నేడు కల్వకుర్తి నియోజకవర్గంలోనే 75 నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఒకనాడు ఉమ్మడి పాలమూరు జిల్లా వలసలు, కరువు , కాటకాలు, ముంబాయి బస్సులకు ఆలవాలమైందని, అలాంటి పాలమూరులో నేడు అద్భుతాలను జరుగుతున్నాయన్నారు. ఇంతటి అభివృద్ధి సాధించిన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కారణం ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులే అన్నారు. కేవలం ఆరున్నర, ఏడేండ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందన్నారు.
అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణకు కారణమైన ఉద్యోగులకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఏ పల్లెలు తెలంగాణ గ్రామాలకు సాటిరావని అన్నారు. అతితక్కువ సమయంలో దేశంలో అనేక అంశాల్లో తెలంగాణ ముందుందన్నారు. మనకంటే ముందుగా ఏర్పాటైన రాష్ర్టాల్లో కూడా తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఏ సమాజమైనా ప్రగతి సాధించింది అనడానికి తలసరి ఆదా యం, తలసరి విద్యుత్ వినియోగం, మాతా, శిశు మరణా లు ఎలా ఉన్నాయని చూస్తారన్నా రు. వీటన్నింటిలో మనం రికార్డు స్థాయిలో ఉన్నామని తెలిపారు. దీనంతటికీ అధికారులు, సిబ్బంది బాగా కష్టపడి పని చేయడం ముఖ్య కారణమని అన్నారు. ఇటీవల ఊరురా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, భగీరథ వంటి అద్భుత పథకాలను అమలు చేసి ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. ఇదేస్ఫూర్తితో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ పనిచేసే చిరునవ్వులు చిందించే తెలంగాణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పరిపాలనను ప్రజలకు చేరువ చేశాం :సీఎస్ శాంతికుమారి
పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకే రాష్ట్రంలో రూ.1,649 కోట్లతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 18 కార్యాలయాల ప్రారంభం పూర్తికాగా, నాగర్కర్నూల్ 19వ కార్యాలయమన్నారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాలతో అన్ని కార్యాలయాలు ఒకే చోటికి వస్తాయని తెలిపారు. సంపద సృష్టి పంపిణీలో రాష్ట్రం రికార్డు సాధించిందని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఉద్యోగుల తరఫున ఆమె హామీ ఇచ్చారు. సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హ ర్షవర్ధన్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్రెడ్డి, క సిరెడ్డి నా రాయణరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.