మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు మొదలైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి రైతు సమస్యలపై మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసినా నీటి నిల్వ నిర్లక్ష్యం కారణంగానే సాగునీరు అందించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సహజంగా వచ్చిన కరువు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిందేనని ఆయన స్పష్టం చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పంటలను కాపాడుకోవడానికి వేల రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తే చుక్క నీరు కూడా పడడం లేదన్నారు. భూగర్భజలాలు అడుగంటి కోతకొచ్చిన వరి పైర్లు పశువులకు మేతగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించామని గుర్తుచేశారు.
కాంగ్రెసోళ్లు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను ప్రభుత్వం విస్మరించిందన్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి, అర్ధరాత్రి కరెంటుతో ఎంతోమంది రైతులు విద్యుదా ఘాతంతో చనిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే భరోసా ఇచ్చేవాళ్లు లేక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దుక్కి దున్నే సమయంలో అందాల్సిన రైతుబంధు, కోతకొచ్చే దశలో కూడా పూర్తిగా అందించలేకపోయారని విమర్శించారు. ప్రతి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే సర్కారు స్పందించి ఎండిపోయిన పంటల నష్టాన్ని అంచనా వేయించి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్చైర్మన్ వెంకటయ్య, ఎంపీపీ సుధాశ్రీ, హన్వాడ ఎంపీపీ బాలరాజు, శివరాజు, కరుణాకర్గౌడ్, కౌన్సిలర్లు కట్ట రవికిషన్రెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.