నెట్వర్క్ నమస్తే తెలంగాణ, మార్చి 13 : తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 240పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పది పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 9:30 గంటల నుంచి మ ధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించునున్నారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా కల్పించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖాధిరులు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రంలోకి ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. పరీక్షా సమయాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఇప్పటికే విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు.