మహబూబ్నగర్, అక్టోబర్ 18: ప్రతి ఫిర్యాదును పూరిస్థాయిలో పరిష్కరించేందుకుగానూ అధికారులు ఏ ఒక్కటి పెండింగ్లో ఉండకుండా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో వీసీ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాసిల్దార్లు వారి వద్దనున్న పెండింగ్ దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని, తన లాగిన్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తున్నానని, తాసిల్దార్లు వారికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మ్యూటేషన్, సక్సేషన్, ఎన్ఆర్ఐ, జీఎల్ఎం నాలా తదితర దరఖాస్తుల పెండింగ్లపై మండల అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. ముందు రెండు వారాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నామని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకొని 6 వారాలకు పొడిగించామన్నారు. మూడు వారాలలో దాదాపుగా వంద శాతంపైగా దరఖాస్తులు క్లియర్ చేసినట్లు తెలిపారు. ఇదే విధానాన్ని మండలాల్లో కూడా రెండు వారాల తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ మేరకు తాసిల్దార్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని, తాసిల్దార్లు మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి తన లాగిన్కు పంపిన తర్వాత తనతో ప్రత్యక్షంగా వాటిని సమీక్షించాలన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు సుమారు 21వేల దరఖాస్తులు రాగా 92శాతం దరఖాస్తులను క్లియర్ చేయడం జరిగిందని, మిగతావి కూడా ఈ వారంలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ధరణి దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కియోస్క్ ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎరికైనా ధరణిలో డాక్యుమెంట్ దరఖాస్తు చేయడం రాకపోతే ఎలా దరఖాస్తు చేయాలో కూడా చూయించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు పాత పద్ధదతిలో కాగితాలు తీసుకుని రాకుండా మీ సేవా, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మశ్రీ, మండలాల డీటీలు తదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లండి
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేర్చాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఈనెల 19వ తేదీ సాయంత్రంలోపు ఆయా శాఖల ద్వారా ఐదేండ్లలో చేపట్టిన సాధించిన పథకాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ కింద ఓడీఎఫ్ ప్లస్ ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా సిబ్బది ఎక్కువగా ఉండే ఆయా శాఖల ద్వారా ఉద్యోగులందరూ ఓటింగ్లో పాల్గొనాలన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి కొత్త యాప్లో ఫొటోలు ఆప్లోడ్ చేయాలని, హరితహారం సంబంధించి ప్రైమరీ బెడ్లను 100శాతం పూర్తి చేయడం, విత్తనాలు బ్యాగుల సేకరణ చేయాలన్నారు. ఇకనుంచి వీటిపై రెగ్యులర్గా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాప్బుకింగ్కు సంబంధించి 95శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ధరణి ప్రజావాణికి 38, ప్రజావాణికి 26 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత తదితరులు ఉన్నారు.