మహబూబ్నగర్ సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పాలమూరు ప్రాజెక్టు తుది అనుమతుల కోసం జరిగిన పర్యటన విజయవంతంగా పూర్తికావడంతోపాటు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి ప్రాజెక్టు తుది అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరడం శుభపరి ణామంగా పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్ రాజేందర్రెడ్డి సైతం సీఎం వెంట కేంద్ర మంత్రిని కలిసి పాలమూరు ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. సీఎం ఢిల్లీ పర్యటనతో పాలమూరు పనులు మరింత వేగం అవుతాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో కీలకమైన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి పనులు త్వరగా పూర్తిచేస్తే వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది.
సీఎం ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రిజర్వాయర్ల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఏదుల రిజర్వాయర్ పనులు 100శాతం పూర్తయ్యాయి. ఉదండాపూర్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక తాగునీటికి అనుమతులు వచ్చిన తరుణంలో వట్టెం, ఏదుల రిజర్వాయర్ల వద్ద మోటర్లు బిగించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్జీటీ పర్యటన విజయవంతంగా పూర్తికావడంతో పాలమూరువాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీటీ పర్యటన సానుకూలంగా జరిగిందని, వారు ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇది సంతోషించదగ్గ విషయమని వెల్లడించారు. ఎన్జీటీ బృందం కేంద్రానికి ఇచ్చే నివేదిక తర్వాత కేంద్రం తుది అనుమతులు ఇవ్వనున్నది. కేంద్రం తుది అనుమతులు త్వరగా ఇచ్చేలా చూసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం తాగునీటికి ఉన్న అనుమతుల ప్రకారం పనులు వేగంగా సాగుతున్నాయి. సాగునీటికి అనుమతులు వస్తే వెంటనే డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పనులు చేపట్టేందుకు రూ.10కోట్లతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. తద్వారా కాల్వల పనులు చేపట్టి వచ్చే ఏడాది నాటికి కొంతమేర అయినా సాగునీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
పాలమూరుతో తీరనున్న నీటిగోస
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, పంప్హౌస్లను నిర్మిస్తున్నారు. మొత్తం 18ప్యాకేజీల్లో పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక్కో రిజర్వాయర్, పంప్హౌస్ వద్ద వెయ్యిమంది సిబ్బంది 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు జిల్లాల పరిధిలో 12,30,000ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. ఇప్పటివరకు దాదాపుగా రూ.20వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్లు తీసుకొచ్చి పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం తుది అనుమతులు ఇస్తే పనులు మరింత వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై లేనిపోని వివాదాలు సృష్టించే ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు తీసుకురావాలని టీఆర్ఎస్ నేతలు హితోపదేశం చేస్తున్నారు.