మహబూబ్నగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాల ప్రాజెక్టుకు రెండు రోజుల్లో భారీ వరద రానున్నది. మహారాష్ట్ర, కర్ణాటకలో అతి భారీ వర్షాల ప్రభావంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణానది ఉపనదులైన తుంగభద్ర, భీమా నదులకు సైతం వరద పెరుగుతున్నది. దీని ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నాటికి జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ నుంచే సుమారు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉంది. భీమా నదితోపాటు నదీతీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వాగులు, వంకలు పొంగి కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆదివారం ఉదయం నాటికి జూరాల ప్రాజెక్టుకు 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పెరిగే అవకాశం ఉన్నదని అధికారుల అంచనా. శుక్రవారం సాయంత్రం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నారాయణపూర్ నుంచి 3,07,800 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
నారాయణపూర్ నీరు జూరాల ప్రాజెక్టుకు శనివారం అర్ధరాత్రికి చేరుకునే అవకాశం ఉన్నది. మరోవైపు భీమాకు సైతం వరద వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తుంగభద్రకు సైతం భారీగా వరద వస్తున్నది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఇక భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామ ర్థ్యం 117.24 టీఎంసీలు కాగా.. శుక్రవారం నాటికి 65 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వ రద నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద రా నున్నదని ప్రాజెక్టు అధికారుల అంచనా. కృష్ణానదికి వరద భారీగా పెరిగిన నేపథ్యంలో మరో వారం రోజు ల్లో శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరి గేట్లు తెరి చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీటిపారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి జూ రాల ప్రాజెక్టుకు 1,71,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 31 గేట్ల ద్వారా 1,98,450, విద్యుదుత్పత్తి ద్వారా 20,748 క్యూసెక్కులు శ్రీశైలం వైపు పయనిస్తున్నాయి. కాలువలు, లిఫ్ట్లతో కలిపి జూరాల అవుట్ఫ్లో 2,21, 074 క్యూసెక్కులుగా నమోదైంది. క్రమంగా అవుట్ ఫ్లో 3 లక్షలకు చేరుకోనున్నది.
అప్రమత్తంగా ఉండాలి : పేట కలెక్టర్ హరిచందన
నారాయణపూర్ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతంలో ఉన్న నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని రైతులను, సమీప గ్రామాల పరిధిలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నది ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నదీపరివాహక ప్రాంతాలైన కృ ష్ణ, మాగనూర్, మక్తల్ మండలంలోని గ్రామ ప్రజలు అప్రమతంగా ఉండాలని పేట కలెక్టర్ హరిచందన కోరారు. నది పరీవాహక ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్ద ని, పశువులను, మోటర్లను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు.
టీబీ డ్యాంకు జలకళ
అయిజ, జూలై 23 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం జలకళను సంతరించుకున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 45,180 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,645 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు, నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1622.65 అడుగుల వద్ద 65.723 టీఎంసీలు నిల్వ ఉన్నది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల ఇండెంట్లో భాగంగా వానకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నట్లు సెక్షన్ అధికారి విశ్వనాథ్ పేర్కొన్నారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,320 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా కన్స్ట్రక్షన్ స్లూయీస్, స్కవర్ స్లూయీస్ గేట్లతోపాటు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,664 క్యూసెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటినిల్వ 8.5 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలానికి క్రమంగా పెరుగుతూ..
శ్రీశైలం జలాశయానికి వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. గురువారం రాత్రి నుం చి ఒక్కసారిగా పెరిగింది. జూరాల ప్రాజెక్ట్ గేట్లు, విద్యుదుత్పత్తి నుంచి వరద వస్తుండటంతో శుక్రవారం రాత్రి 81,049 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 849.40 అడుగులకు చేరింది. సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా 78.7465 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 31,783 క్యూసెక్కులు విడుదలవుతుండగా కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి కావడం లేదని తెలిపారు.