మహబూబాబాద్ : కొవిడ్ కారణంగా విచ్ఛిన్నమైన నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేర్ స్వచ్ఛంద సంస్థ అందించిన కిట్స్ను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా నిరుపేదల కుటుంబాల్లో సంపాదించే వారిని కోల్పోవడం, ఉమ్మడి కుటుంబాలకు దూరం కావడం దయనీయమని అన్నారు.స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరింత మంది ముందుకురావాలని కోరారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జిల్లాలో ఇప్పటికే 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని వివరించారు.
152 కేంద్రాలలో 2600 మంది సిబ్బందితో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే వందశాతం లక్ష్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంకరనేని నాగవాణి, మహిళా శిశు సంక్షేమాధికారిణి స్వర్ణలతాలెనినా, జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్, కేర్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పద్మ పాల్గొన్నారు.