మహబూబాబాద్ రూరల్, మే 17 : పాస్పోర్ట్ సేవలు జిల్లాలో సులభంగా, వేగవంతంగా అందుతున్నాయి. మానుకోటలో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన విద్యార్థులకు పాస్పోర్ట్ను ఈజీగా తీసుకునే అవకాశం దక్కింది. జిల్లాలో సుదూర ప్రాంతాల్లోని నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత యువతకు నిరంతరం సేవలు అందుతున్నాయి. గతంలో ఈ ప్రాంత వాసులు పాస్పోర్ట్ కావాలంటే అనేక వ్యయ ప్రయాసాలకు గురి అయ్యేవారు. మహబూబాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాద్, వరంగల్కు వెళ్లి పాస్పోర్ట్ కోసం ఎదరు చూస్తూ ఉండేవారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే యువతకు పాస్పోర్ట్ సేవలు అందుతున్నాయి.
2019లో పట్టణ కేంద్రంలో..
పాస్పోర్ట్ కోసం గతంలో జిల్లాలోని యువత ఎదుర్కొన్న ఇబ్బందులను దుష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ప్రత్యేక చొరవతో 2019 సంవత్సరంలో పట్టణ కేంద్రంలో పాస్పోర్ట్ సేవలను ప్రారంభించారు. అప్పుడు గదుల కొరత వల్ల ప్రధాన తపాలా కార్యాలయానికి అనుబంధంగా పోస్టాఫీస్లో పాస్పోర్ట్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వెరిఫికేషన్ ఆఫీసర్తో పాటు తపాలా శాఖలో పని చేసే ఉద్యోగి డిప్యూటేషన్పై కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజన, ఏజెన్సీ విద్యావంతులకు 12,500 పాస్పోర్ట్లను జారీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విధానం
యువత ఇతర దేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్ తప్పనిసరి. ఇందుకోసం పట్టణంలో వినియోగదారుల లింక్ ద్వారా గానీ, పాస్పోర్ట్ సేవా మొబైల్ యాప్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు ఒక్కరికి ఫీజు రూ.1,500 ఆన్లైన్ గూగుల్పే, ఫోన్ పే ద్వారా చెల్లించాలి. వయస్సు పది సంవత్సరాలు గల వారికి ఫీజు కేవలం రూ.1000. పాస్పోర్ట్ కోసం ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. చదువు లేని వారు ఆధార్ కార్డును జత చేయాలి. విద్యావంతులు, విదేశాలకు వెళ్లే వారు స్టడీ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన వారం, పది రోజుల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీ చేస్తారు.
ఉద్యోగులు అయితే సంబంధిత అధికారుల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి ప్రాసెస్ అయిన 15 నుంచి 18 రోజుల్లో పాస్పోర్ట్ పోస్టాఫీస్ ద్వారా డెలివరీ అవుతుంది. ఈ కేంద్రం సేవలు వినియోగ దారులకు చాలా సౌకర్యంగా ఉండడంతో గ్రామీణ ప్రాంత యువత, విదేశాలకు వెళ్లే వారికి సమయం, డబ్బులు ఆదా కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ యువతకు సేవలందిస్తున్నాం
జిల్లా కేంద్రంలోని పాస్పోర్ట్ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు మంచి సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం పాస్పోర్ట్ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ప్రతిరోజు 40 మంది దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉంటే ప్రాసెస్ అయిన 15 రోజుల్లోనే పాస్పోర్ట్ డెలివరీ చేస్తున్నాం. పట్టణంలో కేంద్రం ఏర్పాటుతో గ్రామీణ, ఏజెన్సీ యువతకు ఎంతో లబ్ధి జరుగుతున్నది. పాస్పోర్ట్ సేవలపై మరింత ప్రచారం చేస్తున్నాం.
-పోస్ట్మాస్టర్, రాంచందర్