రూ.54 కోట్లతో మిషన్ భగీరథ పనులు
రూ.30 కోట్లతో వైట్టాప్ రోడ్లు
పచ్చదనం ఉట్టిపడుతున్న పట్టణం
శోభాయమానంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం
మహబూబాబాద్, ఏప్రిల్ 13: మానుకోట జిల్లా కేంద్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆశించిన మేర మానుకోటను అభివృద్ధి చేస్తోంది. స్థానిక శాసన సభ్యుడు శంకర్నాయక్ నేతృత్వంలో పట్టణం సుందరంగా ముస్తాబు అవుతోంది. విశాలమైన రోడ్ల నిర్మాణంతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పాయి. ఎన్నో ఏళ్ల నాటి విద్యుత్ స్తంభాలతోపాటు రహదారులపై ఉన్న 30 ట్రాన్స్ఫార్మర్లను తొలగించారు. అత్యాధునిక కరంట్ పోళ్లను రహదారులపై ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లలో రూ.54 కోట్ల వ్యయంతో ఇంట్రా పైప్లైన్ పనులు చేపడుతున్నారు. అన్ని వార్డుల్లోకి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారు. రహదారుల నిర్మాణ పనుల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించి జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పాటుపడుతున్నారు.
విలీన గ్రామాల్లోనూ సెంట్రల్ లైటింగ్
రెండు విడుతల్లో మానుకోట మున్సిపాలిటీకి మంజూరైన టీయూఎఫ్ఐడీసీవో నిధులు రూ.30 కోట్లతో ప్రధాన రహదారులతోపాటు అన్ని వార్డుల్లోని రోడ్లను వైట్టాప్ రోడ్లుగా మార్చారు. గతంలో వర్షం కురుస్తే రహదారులపై ప్రజలు నడవాలన్నా, వాహనాలు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటి రోడ్లు నేడు రూపుమార్చుకుని వైట్టాప్గా మారాయి. డివైడర్ల్పై మొక్కలను నాటారు. పట్టణంలోని ప్రధాన రహదారులతోపాటు మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన శివారు గ్రామాల్లో సైతం సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. రూ.2 కోట్ల జనరల్ ఫండ్తో హరితహారం కార్యక్రమాల్లో మొక్కలు నాటారు. ప్రతి గల్లీ బీటీ, వైట్టాప్ రోడ్లు, సీసీడ్రైన్, పార్కులకు ప్రాధాన్యనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.