Family Fables | మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండనేది ఎగతాళిగా అనే మాట. అయినా, తాతల కీర్తిని చెప్పుకోవడం తప్పెలా అవుతుంది? పిల్లకాకికి తల్లికాకే గొప్ప. ఆ గత వైభవాల జ్ఞాపకాల మూట విప్పి చెప్పడమే కాదు, వాటిని పదికాలాలు పదిలం చేయాలని ఆరాటపడుతున్నారు కొందరు. పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు, ఫొటో ఆల్బమ్లతో నిన్నటి జ్ఞాపకాలన్నీ పేర్చుకుంటూ ఘనంగా వారసత్వ కథలు చెప్పుకొంటున్నారు!
గతం.. తీయని జ్ఞాపకం. నడిచివచ్చిన దారుల మీద మనిషికెంతో ప్రేమ! మనం పుట్టి పెరగకున్నా మన తాతముత్తాతల ఊరివాళ్లు తారసపడితే ఎక్కడలేని అభిమానం పొంగుకొస్తుంది. ‘మన’ అనే భావన గుండెల్లో పొంగుతుంది. తాతలు కట్టిన మండువా ఇళ్లు, ఆనాటి కచ్చురం, నాన్న పెళ్లి ఫొటోలు, మనం ఆడుకున్న ఆటబొమ్మలు.. తారసపడగానే ఠక్కున ఆగిపోతాం. కదిలే కాలాన్ని ఆపేసి.. గతాన్ని కాసేపు అనుభవంలోకి తెచ్చుకుని, మళ్లీ వర్తమానంలోకి వచ్చేస్తాం. ‘మీ ప్రయాణాలు సరే.. మీ తాతలు మీకు వారసత్వంగా ఇచ్చిన జ్ఞాపకాలను తరువాతి తరాలకు ఇచ్చే ప్రయత్నమేదైనా చేస్తున్నారా?’ అని అడుగుతున్నది సమ్రతా సల్వాన్ దివాన్. ‘మా పెద్దల ముచ్చట ఆమెకెందుకు?’ అనేగా సందేహం. మీ జ్ఞాపకాలు పదిలం చేసి, వాటి వెనకున్న కథలన్నిటినీ తవ్వితీసి ఓ మంచి పుస్తకం వేస్తానంటున్నదామె. ‘ఆత్మకథలు రాయడానికి గొప్పవాళ్లే కావాల్సిన అవసరం లేదు. గుప్పెడు గుండెల్లో చెప్పాల్సిన కథలేవైనా ఉంటే నన్ను కలవండి. మీ ప్రేమనంతా అక్షరాల్లోకి ఒంపి చక్కని కథగా మలచి మీ తర్వాత తరాలకు అందజేస్తాను’ అంటున్నదీ డాక్యుమెంటరీ మేకర్. పాత ఫొటోలు, నిన్నటి ఇళ్లు, వాడి వదిలేసిన వస్తువులు, వాహనాలు, సేకరించిన పుస్తకాలు, దాచుకున్న నగలు.. ఆ సమాచారమంతా ఇస్తే చాలు. ఈ ప్రాజెక్ట్కు ఆమె పెట్టుకున్న పేరు ‘ఫ్యామిలీ ఫేబుల్స్ ( Family Fables )’.
ఈ ప్రయాణం అనుకోకుండా మొదలైందని చెబుతారు సమ్రతా సల్వాన్. ‘మా కుటుంబం దేశ విభజన సమయంలో పెషావర్ నుంచి ఢిల్లీకి వలస వచ్చింది. ఆ విభజన గాథలు వింటూ పెరిగాను. మా తాత, నానమ్మ 2015లో చనిపోయారు. వాళ్ల మరణంతో ఎన్నో జ్ఞాపకాలు కోల్పోయాను. అప్పటినుంచి పెద్దవాళ్ల జ్ఞాపకాల్ని నమోదు చేయడం మొదలుపెట్టాను’ అంటుందామె. ఆ సమాచారంతోనే సమ్రత కుటుంబం ఓ పుస్తకం ప్రచురించింది. ఇతరులు కూడా వారివారి కుటుంబ జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు సహకరిస్తున్నది. కుటుంబ గాథలు సేకరించడం, వాటిని ఒక క్రమపద్ధతిలో పేర్చడం, చక్కని కథగా మలచడం ఈ ప్రాజెక్టులో తొలిదశ. అవసరమైన ఫొటోలను సేకరిస్తుంది. ఆ తర్వాత అందమైన పుస్తకంగా ముద్రిస్తుంది. ఎదుటివారి ఆసక్తిని బట్టి వీడియోలూ రూపొందిస్తుంది. ఇంట్లోని ప్రతి పాత వస్తువునూ ముందేసుకుని కూర్చుని.. దానికి సంబంధించిన అన్ని వివరాలూ సేకరిస్తుంది సమ్రత. ఆ వివరాల ఆధారంగా కథనం అల్లేస్తుంది. ఇప్పటివరకు 42 కుటుంబ జ్ఞాపకాలను గాథలుగా చెప్పే అవకాశం వచ్చిందంటారు ఆమె.
దీపక్ గుప్తా వయసు అరవై ఒకటి. తన తండ్రి కుటుంబం దేశ విభజన సమయంలో.. సెప్టెంబరు 1947న లాహోర్ విడిచి మనాలి ప్రాంతానికి వలస వచ్చింది. గుప్తా తన తండ్రి రాసిన అసంపూర్ణ రాత ప్రతులను విశ్లేషించడం మొదలుపెట్టాడు. తమ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న పూర్వికుల ఉత్తరాలు, ఫొటోలను సేకరించాడు. తమ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన క్రమాన్ని అందరికీ చెప్పాలనుకున్నాడు. ఇలాంటి కుటుంబ కథలను సేకరించి, విశ్లేషించి రికార్డు చేసే ‘పాస్ట్ పర్ఫెక్ట్’ సంస్థ సహకారంతో ఆ పని మొదలుపెట్టాడు. మొత్తానికి ఆరు తరాల పూర్వికులను గుర్తించాడు. తమ పూర్వికులు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారని తెలుసుకున్నాడు. వారిలో ఒకరిని బ్రిటిష్ అధికారిపై బాంబు విసిరిన నేరానికి ఉరి తీశారనీ రికార్డుల ద్వారా తెలిసింది. తమ నానమ్మ లండన్ వెళ్లి ఓరియంటల్ స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్ స్టడీస్లో చదివినట్లుగా తెలుసుకున్నాడు. నాలుగు భాగాలుగా వచ్చిన ఆ పుస్తకం గుప్తా కుటుంబాన్ని జ్ఞాపకాల్లోనే కాదు సంతోషాల్లోనూ ముంచెత్తింది!
ఆనవాళ్లు కోల్పోతున్న భవనాలను రేపటి తరానికి పరిచయం చేయడం కోసం.. మనీశ్ గోల్డర్ తన స్నేహితులు సిద్ధార్థ హజ్రా, శయన్ దత్తాతో కలిసి ‘కలకత్తా హౌస్’ పేరుతో ఇన్స్టాలో ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. కలకత్తా వీధుల్లో నడుస్తూ పాతకాలపు ఇళ్లను ఫొటోలు, వీడియోలు తీశాడు. ఈ సందర్భంలోనే ఒక నాటక కళాకారిణి వీళ్లను కలిసింది. 200 ఏళ్ల నాటి తమ పూర్వికుల ఇల్లు అయిన ‘బారిస్టర్ హౌస్’ విశేషాలను ఫొటో డాక్యుమెంట్ చేయాలని అడిగింది. ఆ ముగ్గురూ.. సంతోషంగా కలకత్తా హౌస్ తరపున బారిస్టర్ హౌస్ కథను డాక్యుమెంట్గా వెలువరించారు.
..ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఎన్నో డాక్యుమెంట్లు చెదలుపట్టి ఉంటాయి. అనేక భవంతులు నేలకూలి ఉంటాయి. గతం తెలిసిన పెద్దలు ఒక్కొక్కరే పండుటాకుల్లా రాలిపోతూ ఉంటారు. కాబట్టి, తక్షణం మేల్కొనండి. మీ ఇంటి కథ నమోదు చేయండి.
Types of Paan | ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పాన్ల్లో వందల రకాలున్నాయని తెలుసా !