Thank U Foods | కాళ్లూ చేతులు బాగున్నవారికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. కానీ.. ఏదైనా లోపం ఉన్నవాళ్లకు ఉపాధి చూపాలంటే మాత్రం మంచి మనసు ఉండాలి. ‘థాంక్ యూ ఫుడ్స్’ వ్యవస్థాపకుల ఆలోచన కూడా ఇదే. నలుగురితో మొదలైన ఆ ప్రయాణం ఇప్పుడు వేలమందితో ముందుకు సాగుతున్నది. ఆ కథే ఇది..
ఐదేళ్ల వయసులోనే జిన్నా తల్లి చనిపోయింది. కన్నీటి ప్రవాహం ఆగకముందే.. సరిగ్గా పదమూడేండ్ల వయసులో ఆ బాలుడి కంటిచూపు పోయింది. దీంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. ‘కళ్లు లేకపోతేనేం, కసి ఉందిగా..’ అనుకున్నాడు. సాధారణ విద్యార్థులతో పోటీపడి చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాలనుకున్నాడు. అనుకోవడం కాదు.. అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సొంతంగా చదువుకున్నాడు. తనలాంటి నలుగురు విద్యార్థులతో కలిసి 1985లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ (ఐఏబీ) స్థాపించాడు. చూపులేని వారికి ప్రపంచాన్ని చూపడమే ఈ సంస్థ లక్ష్యం. మధురై శివారులో చిన్న అద్దెగదిలో మొదలైన ఆ చేయూత ఇప్పుడు 30 వేల మందికి చేరింది. చదువుకోలేని వారికి, ఉద్యోగం అవసరమైన వారికి, వైద్యసహాయం కావాల్సినవారికి.. అంధులకు ఏ అవసరం ఉన్నా ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆపన్నహస్తం అందిస్తున్నది.
మూడు దశాబ్దాలుగా అంధులకు అనేక రకాలుగా అండగా నిలుస్తున్నది ఈ సంస్థ. అప్పట్లో టెలిఫోన్ బూత్లో పనిచేసే అంధులకు విద్యార్హతను బట్టి రకరకాల రంగాల్లో ఉపాధి అందించింది. జిన్నా తనయుడు రహీమ్ కూడా తండ్రి వారసత్వాన్నే కొనసాగిస్తున్నాడు. అందుకోసం ఐటీ రంగంలో లక్షల జీతాన్ని వదులుకున్నాడు. రెండొందల మంది అంధులకు బ్యాంకులు, ఐటీ కంపెనీల్లో టెలీ కాలర్స్, వాయిస్ లీడింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పించాడు. అక్కడితో ఆగిపోకుండా.. తానే ఓ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అందుకు రుచుల రంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటివరకు ఆ పరిశ్రమ గురించి ఏమీ తెలియకపోయినా.. మంచి ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాడు. 2018లో ‘థాంక్ యూ ఫుడ్స్’ తొలి స్టోర్ ప్రారంభించాడు. నాణ్యమైన చిరుతిళ్లను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాడు. ఫుడ్ ప్రాసెస్ కోసం అంధులనే ఉద్యోగులుగా నియమించుకున్నాడు. మధురైలో రహీం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ స్టాల్ గురించి తెలుసుకున్న ఒక ఐటీ కంపెనీ ‘థాంక్ యూ ఫుడ్స్’ను సంప్రదించింది. కార్పొరేట్ ఈవెంట్లకు స్వీట్లు, స్నాక్స్ సరఫరా చేయమని అడిగింది. అలా వ్యాపారం మధురై నుంచి చెన్నై, బెంగళూరు, పూణె, ముంబైలకు విస్తరించింది. ఇప్పటికే ఏడు ఔట్లెట్లను ప్రారంభించింది. చెన్నై, కోయంబత్తూరు శాఖలలో పిజ్జాలు, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్, స్వీట్లు, ఇతర బేకరీ ఐటమ్స్ విక్రయిస్తున్నది. 2050 నాటికి దేశవ్యాప్తంగా 50 ఔట్లెట్లు ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని చెబుతాడు రహీం. థాంక్ యూ ఫుడ్స్ సేవలు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. 30 శాతం అమ్మకాలు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 70 మందిలో 35 మంది దివ్యాంగులే. ‘చాలామంది ఉద్యోగం అంటే నిపుణులే చేయగలరని అనుకుంటారు. మేం మాత్రం ఒక అంధుడు సైతం చేయగలిగే ఉద్యోగమేనా? అన్న కోణంలో ఆలోచిస్తాం. ఒకవేళ ఆ ఉద్యోగానికి కచ్చితంగా కంటిచూపు అవసరం అయితే.. కంటిచూపు ఉన్నా.. ఇంకేదైనా వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తాం. మా టీమ్ మొత్తంలో 85 శాతం వర్క్ఫోర్స్ ప్రత్యేక ప్రతిభావంతులే’ అంటున్నాడు రహీం.
థాంక్ యూ ఫుడ్స్లో పనిచేస్తున్నవారి అంకితభావాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. పనే ప్రపంచమైనట్టు బాధ్యతలో లీనమై ఉంటారు. ‘మాకు ఇంకెక్కడా అవకాశం ఇవ్వరు. ఇక్కడ మాత్రమే మమ్మల్ని మేం నిరూపించుకునే వీలు ఉంది. అందుకే ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్త తీసుకుంటాం’ అని వివరిస్తాడు లక్ష్మణ్ అనే ఉద్యోగి. చిరుతిళ్లు తయారు చేయాలంటే.. నిప్పుతో పనిచేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలకు ముప్పే. కానీ కంటిచూపు లేనివారికి అనువైన పద్ధుతుల్లో కిచెన్ నిర్మించారు ఇక్కడ. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. నిపుణుల శిక్షణలో రాటుదేలడం వల్ల కూడా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ప్రూవ్ యువర్ సెల్ఫ్.
ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్.
అచీవ్ సక్సెస్..
ఇదే రహీం తన సిబ్బందికి బోధించే గెలుపు మంత్రం.