Venu Acharya | పుట్టింది మారుమూల పల్లెలో. అయితేనేం, ఖండాంతరాల్లో ఖ్యాతి సంపాదించాడు. గూడెంలాంటి ఊరిలో పుట్టి నగరాలు దాటొచ్చాడు. గుండెతడిని కంటిలెన్స్తో చిత్రీకరించి.. తెరమీద చూసిన ప్రతి కంటికి తడిచెమ్మను అంటించాడు. అతని పేరు వేణు ఆచార్య. ‘బలగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. తెలంగాణ పల్లెలో పసితనాన్ని, పసిడితనాన్ని అందంగా చూపించిన కెమెరా చిత్రకారుడు.
వేణుమాధవ్ ఆచార్య.. మొన్నటి వరకూ చాలా కొద్దిమందికి తెలిసిన పేరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్న పేరు. ‘బలగం’ సినిమాటోగ్రాఫర్గా తెలంగాణ ఆత్మీయ బంధాలను, కన్నీటి హావభావాలను, పల్లె కొంటెతనాన్ని కండ్లకు కట్టినట్టు చూపించి తనది సెన్స్ ఉన్న లెన్స్ అని నిరూపించుకున్నాడు. వేణు పుట్టి పెరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రంగయ్యపల్లి. పదో తరగతి వరకు ఫొటోగ్రఫీ అంటే.. పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పెళ్లి ఫొటోలు తీయడం మాత్రమే అనుకునేవాడు. ఇంట్లో అందరూ బంగారం పని చేసేవారు. దీంతో చదువు మధ్యలో ఆపేసినా ఎలాగోలా బతకొచ్చులే అనే ధీమా ఉండేది. బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) ప్రాజెక్టులో భాగంగా ఓ గుడి ఫొటోలు తీయడానికి సినిమాటోగ్రాఫర్ పీజీ విందా రంగయ్యపల్లికి వెళ్లారు. ఆయన రకరకాల యాంగిల్స్లో ఫొటోలు, వీడియోలు తీస్తుంటే.. ఫొటోలు ఇలా కూడా తీస్తారా? అని ఆశ్చర్యపోయాడు వేణు. అప్పుడు పుట్టింది తనకు కెమెరా మీద ఆసక్తి. నేరుగా వెళ్లి విందానే సలహా అడిగాడు. ఆయన సలహాతో ఇంటర్ పూర్తిచేసి జేఎన్టీయూ బీఎఫ్ఏ కోర్సులో చేరాడు. ఆ అడుగు వేణు జీవితాన్నే మార్చేసింది. బీఎఫ్ఏ పూర్తి కావస్తున్న తరుణంలో మోషన్ ఫొటోగ్రఫీలో డిప్లొమా చేసేందుకు కోల్కతాలోని సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ, వేణు దృక్కోణం పూర్తిగా మారిపోయింది.
కోర్సు పూర్తయిన తర్వాత.. కార్పొరేట్, స్పోర్ట్స్ ప్రమోషన్ యాడ్ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టాడు. డబ్బుతో పాటు.. మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ సమయంలోనే ఊహించని అవకాశం.. వేణును వెతుక్కుంటూ వచ్చింది. సంగ్మా అనే మిత్రుడు తన డాక్యుమెంటరీ చిత్రానికి పని చేయమని వేణును అడిగాడు. ఫ్రెండ్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఆ చిత్రం షూట్ చేశాడు. దాని పేరు మ.మ (MA.MA). ఎక్కడా రిలీజ్ చేయలేదు. కానీ డాక్యుమెంటరీ చాలా బాగా వచ్చింది. దాన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపారు. భార్యాభర్తల ప్రేమానుబంధాన్ని వేణు తెరకెక్కించిన విధానం అంతర్జాతీయ ప్రముఖులనూ మెప్పించింది. ఆ డాక్యుమెంటరీకి ‘ఏషియన్ న్యూ టాలెంట్ అవార్డు’ వచ్చింది. సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఆ పురస్కారం అందుకున్నాడు.
తొలి చిత్రానికే అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ వేడుకను తలపించే కార్యక్రమంలో అవార్డు అందుకోవడం వేణు తొలి విజయం. ఆ తర్వాత చాలా ప్రమోషన్ యాడ్స్ చేశాడు. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ కథలేవీ తన మనసుకు నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పాడు. అదే సమయంలో దర్శకుడు వేణు యెల్దండి ‘బలగం’ కథ చెప్పాడు. వింటూ వింటూ ైక్లెమాక్స్లో ఏడ్చేశాడు వేణు. ఆ సినిమా చేస్తున్నా అని ఫిక్స్ అయిపోయాడు. ఆ సినిమా స్టార్ట్ అయ్యాక.. తనను తానే మరిచిపోయి షూట్ చేశాడు. ‘చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఎలా తాదాత్మ్యం చెందుతాడో.. లోకాన్ని మరిచిపోయి ఆ కళా జగత్తులో ఎలా మునిగిపోతాడో.. నేను కూడా సినిమా అయిపోయేంత వరకు ఈ ప్రపంచాన్నే మరిచిపోయా’ అంటాడు వేణు.
‘బలగం’ సూపర్హిట్ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ దిల్ రాజు సర్ యూనిట్ని మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. డైరెక్టర్ వేణు అన్న, హీరో ప్రియదర్శి, హీరోయిన్.. అందరికీ కంగ్రాట్స్ చెప్పారు చిరు. నా వంతు వచ్చింది. దిల్రాజు సర్.. ‘ఇతనే సినిమాటోగ్రాఫర్’ అని మెగాస్టార్కు పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచీ ఆయనను తెరమీద చూడటమే గొప్పగా ఫీలయ్యేవాణ్ని. అలాంటిది నాకు షేక్హ్యాండ్ ఇస్తూ.. ‘ఎన్ని సినిమాలు చేశావ్?’ అని అడిగారు. ‘ఇదే ఫస్ట్ సార్’ అని చెప్పాను. ఆయన ఆశ్చర్యంతో ‘వావ్..ఇరగదీశావయ్యా’ అన్నారు.
– వేణు ఆచార్య, సినిమాటోగ్రాఫర్
✍️ ప్రవీణ్ కుమార్ సుంకరి
“Celebrities | మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.. వేడుకుంటున్న సెలబ్రెటీలు.. అసలేమైంది?”
“foriegn actress | తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..”