Celebrities | ‘మేం చేసేది కొంచెమే అయినా.. దానికొచ్చే ప్రచారం చాలా పెద్దదిగాఉంటుంది. ఆ ప్రచారానికి ఉండే విలువ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది.. ఇది ‘అద్దాల మేడ’ చిత్రంలోని డైలాగ్. చిత్ర పతాక సన్నివేశాల్లో సినీ సెలెబ్రిటీలకష్టాలను వివరిస్తాడు దర్శక పాత్రధారి దాసరి నారాయణరావు. ఈ సినిమా విడుదలై నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. కానీ, ఆనాటి పరిస్థితులే ఈనాటికీ కొనసాగుతున్నాయి. ఇంకా దిగజారిపోయాయని తాజా ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. నటీనటుల వ్యక్తిగత జీవితాలను కెమెరాతో కన్నుగీటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నవాళ్లు కొందరైతే, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు మూకుమ్మడిగా చుట్టిముట్టి వాళ్ల ప్రైవసీని భంగపరుస్తున్నవార మరికొందరు. ఈ విపరీత ధోరణిపై సెలెబ్రిటీలు ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘మమ్మల్ని వదిలేయండి ప్లీజ్’ అని బతిమాలుతున్నారు.
ప్రచారం కోసం, సామాజిక మాధ్యమాల్లో మైలేజీ కోసం పలువురు పక్కదారులు పడుతున్నారు. సెలబ్రిటీల చిత్రాలను, వీడియోలను వారి అనుమతి లేకుండా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఫేమ్ ఆలియా భట్ ఇటీవల వీరి బారినపడింది. బాంద్రాలోని తన నివాసంలో ఉన్న ఆలియాను ఎదురింటి డాబా నుంచి ఓ ఇద్దరు ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్గా మారాయి. దీనిపై ఇన్స్టా వేదికగా తన ఆవేదనను పంచుకుంది ఆలియా. బయటికి వెళ్లినప్పుడు ఎలాగూ తప్పడం లేదు, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనీయకుంటే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ రోజు లివింగ్ రూమ్లో ఏదో పనిలో ఉన్నా. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. చూస్తే.. ఎదురింటి డాబా నుంచి ఇద్దరు వ్యక్తులు నాకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నారు. మనం సమాజంలోనే ఉంటున్నాం కదా! ఇంత అనాగరికమైన చర్యలు ఏమిటో అర్థం కావడం లేదు. వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం చాలా హేయం’ అంటూ ఇన్స్టాలో షేర్ చేసింది ఆలియా.
ఆలియా పోస్ట్ బీటౌన్లో పెద్ద దుమారమే లేపింది. చాలామంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి చర్యలకు ఎప్పుడో ఒకసారి అడ్డుకట్ట పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అనుష్క శర్మ, జాన్వీ కపూర్, సోనీ రాజ్దాన్, కరణ్ జోహర్ తదితరులు తమకు ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. టాలీవుడ్ నటి యామీ గౌతమ్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ‘కొన్నాళ్ల కిందట ఒక యువకుడు నాతో ఫొటో దిగుతానని కోరాడు. నేను అంగీకరించాను. ఆ కుర్రాడు సెల్ఫీకి బదులుగా వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనకు నేను షాక్ అయ్యా! నేను వారించడంతో ఆఫ్ చేశాడు. కానీ, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అల్పత్వాన్ని రుజువు చేసుకున్నాడ’ని వాపోయింది.
సినిమా తారలు, ఆటగాళ్లకు ఇలాంటి విపరీత పరిస్థితులు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. ఏదైనా పబ్లిక్ మీటింగ్కు వెళ్లినప్పుడు వారిని ఫొటోగ్రాఫర్లు నిలువరించే తీరు చూసేవారికి కూడా విసుగు తెప్పిస్తుంది. వారి అనుమతితో ఫొటోలు తీయడాన్ని తప్పుబట్టలేం. ఈవెంట్స్ సమయంలో ఫొటోగ్రాఫర్లు బారులుతీరి ‘మేడం ఫొటో ప్లీజ్.. సర్ వన్ ఫొటో..’ అంటూ కెమెరాలకు పని చెబుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా… సందర్భం లేకుండా ఫొటోగ్రాఫర్లు, వీడియో బ్లాగర్లు ఇదే జోరును ప్రదర్శిస్తుండటం విమర్శలకు దారితీస్తున్నది. సెలెబ్రిటీ ఎవరైనా కన్నుమూస్తే.. సహజంగా ఇండస్ట్రీ అంతా కదిలి వస్తుంది. ఇదే అదనుగా కొందరు ఫొటోగ్రాఫర్లు అసందర్భంగా నటీనటుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీస్తుండటం చర్చనీయాంశంగా మారుతున్నది. కొన్నాళ్ల కిందట స్టాండప్ కామెడీ కళాకారుడు రాజు శ్రీవాస్తవ్ అంత్యక్రియలకు నటి తాప్సీ హాజరైంది. ఈ సమయంలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి కెమెరాలు క్లిక్మనిపిస్తూ కనిపించారు. ఒక్క తాప్సీకే కాదు ఇలాంటి పరిస్థితులు దాదాపు నటీనటులు, ఇతర సెలెబ్రిటీలు అందరికీ ఎదురవుతూనే ఉన్నాయి. పరామర్శకు వెళ్లినప్పుడు కూడా ఫొటోలకు పోజులు ఇవ్వమని అడగటం విడ్డూరం కాక మరేమిటి?
క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడీని విరుష్కగా పాపులర్ చేసింది ఫొటోగ్రాఫర్లు, మీడియానే! కానీ, కొన్నాళ్లపాటు ఈ జంట ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేని ప్రమాదంలా పొంచి ఉండేవాళ్లు. చివరికి విరుష్క గారాలపట్టి వామిక చిత్రాన్ని ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసిన ఘనతను కూడా వాళ్లే కొట్టేశారు. తమ సెలెబ్రిటీ హోదా పిల్లల ప్రైవసీని దెబ్బతీయకూడదని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా పిల్లల వ్యక్తిగత విషయాల పట్ల గోప్యత పాటిస్తారు. ఇవేవీ పట్టని అత్యుత్సాహవంతులు సెలబ్రిటీల పిల్లలనూ వదలడం లేదు. ఇటీవల తమిళ హీరో సూర్య, జ్యోతిక జంట పిల్లలతో ముంబై వెళ్లినప్పుడు ‘దయచేసి పిల్లల ఫొటోలు తీయకండి!’ అని అక్కడి ఫొటోగ్రాఫర్లను బతిమాలుకోవాల్సి వచ్చింది.
విమానాశ్రయాల్లో కాచుకుని ఉండే కొంతమంది అయితే సెలెబ్రిటీలు విమానం దిగీ దిగగానే.. అదే పనిగా ఫొటోలు తీస్తుంటారు. పుణ్యం కోసం గుళ్లు, గోపురాలకు వెళ్లినప్పుడు కూడా ఫొటోల కోసం వారి వెంటపడుతున్నారు. ఎంత స్టార్లు అయినా ఎప్పుడూ ఉత్సాహంగా, ఫొటోలకు పోజులు ఇవ్వాలంటే అన్ని సమయాల్లో వీలుపడకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు, ఆందోళనలోనూ ఉండొచ్చు! ఇవేవీ పట్టించుకోకుండా వారిపై ఫ్లాష్లు కురిపించడం తప్పే అంటున్నారు సెలెబ్రిటీలు! కార్ల చుట్టూ ఫొటోగ్రాఫర్లు మూగడంతో, ముందుకు వెళ్లే అవకాశం లేక విమానాలు మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయంటున్నారు పలువురు హీరోలు!! వ్యక్తిగత స్వేచ్ఛను భంగపరిచే ఇలాంటి సంస్కృతికి చెక్ పెట్టాలని ఇప్పుడు
తారాలోకం గళం వినిపిస్తున్నది. సినిమా ఈవెంట్లలో అయితే ఓకే కానీ, వేదికతో సంబంధం లేకుండా ఫొటోల వేడుక చేసుకోవాలి అనుకోవడం దారుణమని పెదవి విరుస్తున్నది!!
“foriegn actress | తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..”