ఆసిఫాబాద్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
జిల్లా కేంద్రంలో షీ టీం కార్యాలయం ప్రారంభం
క్యూఆర్ కోడ్ ఫిర్యాదుల పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 28 : మహిళల భద్రతకే తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్కోడ్ను అమల్లోకి తీసుకువచ్చిందని ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలో షీ టీం కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం క్యూఆర్ కోడ్తో షీ టీం కు ఫిర్యాదు చేసే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో మహిళ భద్రతకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. తమపై గానీ, చుట్టుపక్కలా, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మహిళలను వేధిస్తే జిల్లాలోని ఎక్కడి నుంచైనా క్యూఆర్ కోడ్ సహాయంతో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా బస్టాండ్, కళాశాలలు, బస్సులు, మార్కెట్లు, కార్యాలయాల్లో వీటిని అతికించామన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుందని, దానిలో ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అంతేగాకుండా తీసుకున్న చర్యలు, అధికారుల ప్రవర్తన, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అవసరమున్న వారు ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ షఫియొద్దీన్, షీ టీం సభ్యులు స్వర్ణలత, శ్రీలత, జ్యోతి, కవిత తదితరులు ఉన్నారు.