రాజధానికి తరలిన జిల్లా నాయకులు
ఉమ్మడి జిల్లా నుంచి 400 మంది..
విజయవంతం చేసినందుకు మంత్రి అల్లోల కృతజ్ఞతలు
మంచిర్యాల, అక్టోబర్ 25, నమస్తే తెలంగాణ;టీఆర్ఎస్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గులాబీదళం తరలివెళ్లింది. 10 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సుమారు 400 మంది ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి అల్లోల శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభకు భారీ జనసమీకరణ చేసేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్లో సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీ అట్టహాసంగా జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గులాబీదళం తరలివెళ్లింది. వివిధ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు బయలుదేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 మంది వరకు వెళ్లారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్సీ పురా ణం సతీశ్ కుమార్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యతో పాటు వెంకట్రా వు, ఆసిఫాబాద్ నుంచి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, తదితర నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ప్లీనరీకి హాజరై విజయవంతం చేసిన వారికి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. స్వీయ రాజకీయ అస్థిత్వం పేరిట తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దారు. కాగా, రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు.