సాయంత్రం పూట గుమిగూడుతున్న మందుబాబులు
ఒకరి నుంచి మరొకరికి.. ఆ తర్వాత ఇంటి సభ్యులకూ..
పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా మారని తీరు
దండేపల్లి, మే 23 : కరోనా కట్టడికోసం రాష్ట్ర సర్కారు లాక్డౌన్ విధించింది. కొన్ని నిబంధనలను ప్రకటించింది. వాటిని బేఖాతర్ చేస్తూ గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఇవి కరోనా క్యారియర్లుగా మారుతున్నాయి. అన్ని దుకాణాల మాదిరిగానే మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10గంటల వరకే తెరిచి ఆ తర్వాత మూసివేస్తున్నారు. ఈ సమయంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచుతున్నారు. అదునుచూసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇండ్లల్లో, కిరాణాదుకాణాల్లో, బెల్ట్ షాపుల్లో మద్యాన్ని నిల్వ చేస్తున్నారు. సాయంత్రం నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలు అక్రమంగా, జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మండలంలోని గూడెం, వెల్గనూర్, కన్నేపల్లి, లింగాపూర్, దండేపల్లి గ్రామాల్లో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇటీవల పోలీసులు దాడులు చేశారు. భారీగా మద్యాన్ని పట్టుకున్నారు.
గ్రామాల్లో బెల్ట్ దుకాణాల హవా..
దండేపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో బెల్ట్ దుకాణాల హవా నడుస్తున్నది. సర్కారు విధించిన లాక్డౌన్ వీరికి వరంగా మారింది. ఉదయం 10 గంటల్లోపు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించేవారు వైన్షాపుల నుంచి భారీగా మద్యాన్ని తీసుకెళ్తున్నారు. వైన్షాపులు మూసివేయడంతో సాయంత్రం పూట మందుబాబులు బెల్ట్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సీసాపై రూ.30 నుంచి 50 వరకు అధికంగా వసూలు చేస్తూ మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో జనాలు అక్కడ గుమిగూడుతుండడంతో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. వారి నుంచి ఇంటి సభ్యులకూ పాజిటివ్ వస్తున్న ఘటనలున్నాయి.
అక్రమ నిల్వలపై పోలీసుల దాడులు..
మండలంలోని ఆయా గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కన్నేపల్లి, గూడెం, వెల్గనూర్లో సుమారు రూ.40 వేలు, దండేపల్లి, లింగాపూర్ గ్రామాల్లో రూ.18 వేల విలువైన మద్యాన్ని ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. కరోనా ఉధృతంగా ఉన్న వేళ బెల్ట్ దుకాణాల వద్ద జనాలు గుమిగూడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.