శ్రీరాంపూర్, అక్టోబర్ 14: సింగరేణి ప్రతి ఉద్యోగి, కార్మికులు బాగా పనిచేస్తే మంచి ఉత్పత్తి సాధిస్తామని, వచ్చిన లాభాలతో అనేక సంక్షేమ పథకాలు, మెరుగైన బోనస్లు, కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్ పేర్కొన్నారు. విజయదశమిని పురస్కరించుకొని సింగరేణి కార్మికులు, అధికారులు, మహిళలు, ఉద్యోగులకు వ్యక్తిగత లేఖల ద్వారా సీఎండీ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నాణ్యతతో నిర్దేశిత 70 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి సాధించాలని కోరారు. కార్మికులకు సీఎం ఆదేశంతో 29 శాతం సంస్థ లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లించామని తెలిపారు. దీపావళి బోనస్ కార్మికుల వేతనాల్లో జమచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సింగరేణి అద్భుత ప్రగతి సాధిస్తున్నదన్నారు. కరోనాతో గత ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించుకున్నామని స్పష్టం చేశారు. గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం 2021, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో బొగ్గు ఉత్పత్తిలో 65 శాతం, రవాణాలో 75 శాతం, అమ్మకాల్లో 67 శాతం వృద్ధిని సాధించామన్నారు. ఇదే ఒరవడితో ముందుకు పోతే ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించి సింగరేణి చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును నెలకొల్పగలమని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఆదిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
20 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు..
పెరిగిన విద్యుత్ వినియోగం నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కోసం ఎదురచూస్తున్నాయని సీఎండీ పేర్కొన్నారు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ర్టాల నుంచి సింగరేణి బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లోని సుమారు 20 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సాధ్యమైనంత మేరకు బొగ్గు అందిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ కావాలంటూ కోరుతున్నారని చెప్పారు. విదేశీ బొగ్గు ధర 100 శాతానికిపైగా పెరగడంతో దేశీయ పరిశ్రమలన్నీ సింగరేణి వైపు చూస్తున్నాయన్నారు. సంస్థ ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఇదొక మంచి అవకాశమని, రోజువారీగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
వ్యాపార విస్తరణతో ఆర్థిక పునాదులు
వ్యాపార విస్తరణతో సింగరేణికి మంచి ఆర్థిక పునాదులను ఏర్పరుస్తాయని, తద్వారా కంపెనీకి ఉజ్వల భవిష్యత్ను అందిస్తాయని సీఎండీ శ్రీధర్ తెలిపారు. దేశ, రాష్ట్ర విద్యుత్ అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా మనం రానున్న మూడేళ్లలో 14 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సిద్దమవుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది వీటిలో 3 కొత్త ప్రాజెక్టుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించుకోబోతున్నామని వివరించారు. ఒడిశా నైనీ బొగ్గు బ్లాకునుంచి ఈ ఏడాది 10 లక్షల టన్నులు, ఏటా 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించనున్నామని చెప్పారు. న్యూపాత్రపాద బ్లాకులో కూడా వచ్చే రెండేళ్లలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2025-26 నాటికి సింగరేణి ఏడాదికి 100 మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోనున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షల గృహ రుణాల వడ్డీ చెల్లింపు, ఉచిత విద్యుత్, మ్యాచింగ్ గ్రాంట్ పెంపు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు, సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సేవల మరుగుదలకు రూ.3.2 కోట్లతో ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, రూ.3.5 కోట్లతో నాలుగు ఆక్సిజన్ ప్లాట్లు ఏర్పాటు చేశామన్నారు. కార్మికుల సంక్షేమానికి ఎంతటి ఖర్చుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు సంస్థ ఉత్పత్తి లక్ష్యాలు సమష్టి కృషితో సాధించాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.