లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు
ప్రత్యేక దృష్టి సారించినసర్పంచ్, కార్యదర్శి
రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి
చెన్నూర్ రూరల్, జూన్ 13: ప్రభుత్వ చేయూత.. అధికారుల సహకారం.. ప్రజాప్రతినిధుల అంకితభావం.. ప్రజల భాగస్వామ్యం తోడైతే ఏ గ్రామమైనా అభివృద్ధిలో మేటిగా నిలుస్తుంది. ఇందుకు ఉదాహరణే చెన్నూర్ మండలంలోని సుందరశాల గ్రామం. ఈ గ్రామంలో పల్లె ప్రగతి లక్ష్యాలు పూర్తి కావడంతో గ్రామస్తులు అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. అభివృద్ధికి నమూనాగా, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిపారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ఇవి మాపల్ల్లెలేనా అన్నట్లు గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి.
వేగంగా అభివృద్ధి పనులు పూర్తి..
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆధ్వర్యంలో రాత్రీపగలు పనులు చేపట్టారు. పల్లె ప్రగతి పనులు వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.10 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక పూర్తయి అందుబాటులోకి వచ్చింది. రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం గ్రామంలో ఆహ్లాదకరంగా, అందంగా ముస్తాబైంది. వనంలో పలు రకాల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్తో ప్రతిరోజూ నీళ్లు పడుతున్నారు. రూ.12 లక్షలతో రైతు వేదిక, రూ.2.50 లక్షలతో డంప్ యార్డు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో దత్తత గ్రామమైన సుందరశాల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం వస్తే డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీళ్లన్నీ రోడ్లపైనే పారేవి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక గ్రామం పరిస్థితి ఇంతేనా అనుకునే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో రోజు రోజుకూ అభివృద్ధి రెట్టింపవుతున్నది.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..
పల్లె ప్రగతి కార్యక్రమంతో సుందరశాల గ్రామ రూపురేఖలు మారాయి. 20 ఏండ్లలో లేని విధంగా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతిరోజూ గ్రామపంచాయతీ సిబ్బందితో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. గ్రామంలోని వీధులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో రోజంతా సిబ్బంది పనులను చేపడుతున్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద, మెయిన్ సెంటర్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళలో గ్రామం జిగేల్ మంటున్నది.